Telangana Decade Celebrations | తెలంగాణ విజయాలను నలుదిక్కులా చాటేలా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలపై వేల్పూర్ రైతువేదికలో నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా 21 రోజుల పాటు జరుపుకునే ఉత్సవాలపై కూలంకషంగా చర్చించారు. ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, రాష్ట్రం సాధించిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం బాల్కొండ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, అందుతున్న సంక్షేమంపై అనేక రంగాల్లో సాధించిన విజయాలు గ్రామగ్రామన వివరించాలన్నారు.
ఉమ్మడి ఏపీలో ఉన్న సమయంలో అసెంబ్లీలో తెలంగాణ పదమే నిషేధించారని, తెలంగాణ అంటే ఆ స్థాయిలో వివక్ష ఉండేదన్నారు. అప్పటి పాలకులు మేం లేకుంటే అన్నం ఎట్లా ? పాలన ఎట్లా ? కరెంట్ ఎట్లా ? అన్నారని గుర్తు చేశారు. అందుకే యావత్ తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి బరిగీసి నిలబడి కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించారన్నారు. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదేళ్లలో చేసి చూపించారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు యాసంగిలో 16 లక్షల ఎకరాల్లో వరి సాగు సాగయ్యేదని, నేడు 56 లక్షల ఎకరాల్లో సాగవుతుందన్నారు. నేడు దేశానికే అన్నం పెడుతున్న రాష్ట్రం తెలంగాణ అని గర్వంగా చెప్పుకునేలా కేసీఆర్ చేశారన్నారు.
ఏ రంగం చూసుకున్నా తెలంగాణ ఎన్నో అద్భుతాలు సృష్టించిందని, ఇట్లా సాధించిన విజయాలు దశాబ్ది ఉత్సవాల్లో గొప్పగా చెప్పుకోవాలన్నారు. నియోజకవర్గ స్థాయిలో, మండల వారీగా, ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధుల, క్షేత్ర స్థాయి ఉద్యోగులతో సమన్వయ కమిటీ జాబితా సిద్ధం చేశారు. ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని, ప్రభుత్వం సాధించని విజయాలను ఖచ్చితంగా చెప్పుకోవాలన్నారు. మౌనంగా ఉండాల్సిన పని లేదని మంత్రి స్పష్టం చేశారు. సమావేశంలో ఉమెన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఆకుల లలిత, మాజీ ఎమ్మెల్సీ వీజీ గౌడ్, డీసీవో సింహాచలం, ఏసీపీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.