హైదరాబాద్: రాష్ట్ర గౌరవాన్ని మరింత ఇనుమడింపజేసేలా నిర్మించిన నూతన సచివాలయం (Secretariat) ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 30న సీఎం కేసీఆర్ (CM KCR) చేతుల మీదుగా ప్రారంభం కానుంది. అదేరోజు నుంచి కొత్త సచివాలయంలో పాలన సాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth Reddy), డీజీపీ అంజనీ కుమార్, సీపీ సీవీ ఆనంద్ పరిశీలించారు. నిర్వాహకులకు పలు సలహాలు సూచనలు ఇచ్చారు.
తెలంగాణ ప్రజలకు సుపరిపాలనను అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ 2019, జూన్ 27న కొత్త సచివాలయానికి శంకుస్థాపన చేశారు. ఇండో-పర్షియన్ నిర్మాణశైలిలో అత్యాధునిక హంగులతో నూతన భవనాన్ని నిర్మించారు. రాష్ట్ర హైకోర్టు తరహాలోనే సచివాలయంపై నిర్మించిన డోమ్లు, రెండు డోమ్లపై నిర్మించిన జాతీయ చిహ్నాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. మొత్తం 34 డోమ్లను ఏర్పాటు చేయగా, సచివాలయానికి ముందు, వెనుక భాగాల్లో ఏర్పాటు చేసిన డోమ్లు అత్యంత ఎత్తైనవి. సుమారు 165 అడుగుల ఎత్తున ఉన్న డోమ్పై జాతీయ చిహ్నాలను ఏర్పాటు చేయడంతో సుదూర ప్రాంతంనుంచి కూడా ఇవి కనిపిస్తున్నాయి. రెండు గుమ్మటాలపై ఏర్పాటు చేసిన జాతీయ చిహ్నాలైన మూడు సింహాలతో దేశభక్తి, ఆత్మగౌరవ పతాకలా సచివాలయం తళుకులీనుతున్నది. ఇందులో నీటి సరఫరా కోసం హైడ్రో న్యుమాటిక్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఓవర్ హెడ్ ట్యాంక్ను అత్యవసర సమయాల్లో మాత్రమే ఉపయోగించేలా తగిన ఏర్పాట్లు చేశారు. వర్షపునీటిని స్టోర్ చేసేందుకు సంపును ఏర్పాటు చేశారు. భవనంపై పడిన నీటిచుక్కకూడా వృథాకాకుండా అవి సంపులోకి చేరేలా చేసి జలసంరక్షణ ప్రాధాన్యతకు సచివాలయాన్ని మార్గదర్శిలా తీర్చిదిద్దారు.
సచివాలయ ప్రాంగణంలో రెండు భారీ ఫౌంటెయిన్లను ఏర్పాటు చేశారు. 28 అడుగుల ఎత్తు, 58 అడుగుల వెడల్పుతో రెడ్ శాండ్స్టోన్తో వీటిని నిర్మించారు. హిందూ, దక్కనీ, కాకతీయ నిర్మాణ శైలుల మేళవింపుగా ఈ భవనాన్ని డిజైన్ చేశారు. నిజామాబాద్లోని కాకతీయుల కాలంనాటి నీలకంఠేశ్వర స్వామి ఆలయం, వనపర్తి రాజప్రాసాదాల్లోని శైలుల ఆధారంగా డోమ్లను తీర్చిదిద్దారు. గుజరాత్లోని సలంగ్పూర్ హనుమాన్ దేవాలయ నిర్మాణ శైలిని కూడా గుమ్మటాల్లో వాడారు. బయటివైపు ఆకర్షణీయంగా కనిపించే తాపడాలన్నీ ఎర్ర ఇసుకరాతితో, మధ్యలోని బురుజు రాజస్థాన్లోని ధోల్పూర్ నుంచి ప్రత్యేకంగా తెప్పించిన ఇసుకరాతితో నిర్మించినట్టు అధికారులు చెప్పారు. ప్రఖ్యాత ఆర్కిటెక్ట్లు అయిన డాక్టర్ ఆస్కార్, పొన్ని కాన్సెసావోలు దీని డిజైన్ చేశారు.
నూతన సచివాలయాన్ని గ్రీన్ కాన్సెప్ట్ విధానంలో నిర్మించారు. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చే విధంగా డిజైన్ చేశారు. చుట్టూ గదులు, మధ్యలో ఖాళీ స్థలం ఉంచారు. మొత్తం ఎనిమిది ఎకరాల స్థలాన్ని పచ్చదనం కోసం కేటాయించారు. పచ్చికతోపాటు మొక్కలను కూడా నాటారు. గ్రౌండ్ఫ్లోర్లో గ్రంథాలయాన్ని నిర్మిస్తున్నారు. తెలుగుతల్లి ఫ్లై ఓవర్వైపు 2,500 చదరపు అడుగుల విస్తీర్ణం లో క్యాంటీన్, అదే వరుసలో గుడి, బ్యాంకు, ఏటీఎం ఉంటా యి. సచివాలయ ప్రాంగణంలో రెం డున్నర ఎకరాల్లో 560 కార్లు, 720 ద్విచక్ర వాహనాలు, నాలుగు బస్సులకు పార్కింగ్ సౌకర్యం కల్పించారు. సందర్శకులకోసం మరో 300 కార్లు పట్టేలా ఒకటిన్నర ఎకరాల్లో పార్కింగ్ను ఏర్పాటుచేశారు. రోజువారీ సందర్శకులు, అధికారులు, ప్రత్యేక సమావేశాల సందర్భంలో వచ్చే వాహనాలను దృష్టిలో ఉంచుకొని ఆ మేరకు సిద్ధం చేశారు.
సచివాలయంలోని ఆరో అంతస్థులో సీఎం, చీఫ్ సెక్రటరీల చాంబర్లను ఏర్పాటు చేశారు. వీటితోపాటు సీఎం సిబ్బంది, ఆయన ప్రజలను కలిసేందుకు ‘జనహిత’ పేరుతో 250 మంది కూర్చునేవిధంగా సమావేశ మందిరం, మంత్రులు, అధికారులకు సరిపడా క్యాబినెట్ సమావేశం కోసం మరో హాలు, సీఎంను కలిసేందుకు వచ్చేవారికోసం ప్రత్యేక వెయిటింగ్ హాలును నిర్మించారు. కలెక్టర్లతో సమావేశాల నిర్వహణకు కూడా ప్రత్యేక సమావేశ మందిరాన్ని ఏర్పాటు చేశారు. కనీసం 25 మంది విశిష్ట అతిథులతో ముఖ్యమంత్రి కలిసి భోజనం చేసేందుకు ఓ అత్యాధునిక డైనింగ్ హాలును కూడా నిర్మించారు.
సచివాలయ ప్రధాన ద్వారాన్ని నాలుగు భారీ తలుపులతో 29 అడుగుల వెడల్పు, 24 అడుగుల ఎత్తుతో సూడసక్కదనంగా ఏర్పాటు చేశారు. తలుపులపై ఇత్తడి పూతతో నగిషీలను కూడా చెక్కించారు. ఆదిలాబాద్ అడవుల్లోని టేకు కలపను ఉపయోగించి నాగ్పూర్లో వీటిని తయారు చేయించినట్టు అధికారులు చెప్పారు. మొత్తం సచివాలయంలో 875 వరకు తలుపులు ఉండగా, ఇందులో దాదాపు 90 శాతం తలుపులు టేకు కలపతోనే తయారు చేశారు. కొన్ని మాత్రం ఇనుముతో చేయించినట్టు అధికారులు వెల్లడించారు.
భవనానికి నలువైపులా వెడల్పైన మెట్లదారితోపాటు మూడు, నాలుగు చొప్పున భారీ లిఫ్టులను ఏర్పాటు చేశారు. ఏమైనా ఇబ్బంది తలెత్తితే వెంటనే కిందకు చేరుకునేలా ఇవి ఎంతో ఉపయోగపడతాయని అధికారులు చెప్తున్నారు. ఫైర్సేఫ్టీ వ్యవస్థను కూడా పటిష్టంగా ఏర్పాటు చేశారు. షార్ట్ సర్క్యూట్తో ఎక్కడా ఎలాంటి అగ్ని ప్రమాదాలకు తావులేకుండా ఉండేందుకు విద్యుత్ సరఫరా వ్యవస్థను ఎక్కడికక్కడ నిలిపివేసేలా తగిన ఏర్పాట్లు చేశారు.