హైదరాదబాద్ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ రాజకీయాలకే ఓ కళంకం అని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే గణేశ్, ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, రాజేశ్వర్రావుతో కలిసి టీఆర్ఎస్ ఎల్పీలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి అర్వింద్ తీరుపై మండిపడ్డారు. అర్వింద్పై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను పూర్తిగా సమర్థిస్తున్నానన్నారు. ఆయన వ్యవహరిస్తున్న తీరుకు తిట్టిన తిట్లు తక్కువేనని, రాజకీయాల్లో సంస్కార హీనుడు అర్వింద్ అని ధ్వజమెత్తారు. ఎందరు ఎన్నిసార్లు చెప్పినా తీరు మార్చుకోలేదని పేర్కొన్నారు. ఎంపీగా గెలిచిన అర్వింద్ చేసింది శూన్యమని, పసుపు బోర్డు తెస్తానని బాండ్పేపర్ రాసిచ్చి మాట తప్పాడని, అతన్ని గ్రామాల్లోకి రానివ్వడం లేదన్నారు. గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితుల్లో వార్తల్లో ఉండేందుకు సంచలన ప్రకటన చేస్తున్నాడని విమర్శించారు.
కేటీఆర్, కవిత కష్టకాలంలో ఉద్యమంలో ఉన్నారని, అమెరికాలో మంచి ఉద్యోగాలను వదిలి ఉద్యమంలో పాలు పంచుకున్నారన్నారు. కేసీఆర్ను వదిలి ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. మల్లికార్జున ఖర్గేతో మాట్లాంది చూశావా? అని నిలదీశారు. ఏదో ఒక్కటి కెలుక్కొని తెలంగాణలో శాంతి భద్రతల సమస్య తేవాలని బీజేపీ కుట్ర పన్నిందని, కేసీఆర్ను కవితను అనరాని మాటలు అంటే అభిమానులు ఊరుకుంటారా? అని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు బీజేపీ డ్రామాలు సర్కస్లు చేస్తోందని, ప్రత్యర్థి రాజకీయ పార్టీల కుటుంబ సభ్యుల మధ్య చిచ్చు పెట్టడం బీజేపీకి కొత్త కాదని, శరద్ పవార్, ములాయం సింగ్ యాదవ్, హేమంత్ సొరేన్, రామ్ విలాస్ పాశ్వాన్ ,కృష్ణ పటేల్ కుటుంబాల్లో చిచ్చు పెట్టిన పార్టీ బీజేపీ అని మండిపడ్డారు. బీజేపీ దగుల్బాజీ రాజకీయం కాదా? అని ప్రశ్నించారు. తల్లికి బిడ్డకు, అన్నకు తమ్ముడికి కొట్లాట పెట్టి ప్రభుత్వాలను బీజేపీ కూలగొడుతున్నది, దీంట్లో కవిత అన్నదాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. కవిత ఇంటిపై దాడి జరిగినప్పుడు గవర్నర్, కిషన్రెడ్డి, బండి సంజయ్ ఎక్కడున్నారని ప్రశ్నించారు.
అర్వింద్ చేసిన ఆరోపణలపై మహిళ అయిన గవర్నర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. బండి సంజయ్ బీజేపీ అధ్యక్షుడు అయ్యాకే రాజకీయాల స్థాయి దిగజారిందని, తిట్లు తిడితేనే వార్తకు ప్రాముఖ్యత వస్తుండడం దురదృష్టకరమన్నారు. సక్సెస్, ఫెయిల్యూర్ అంటే ఎంటో బండి సంజయ్కి తెలుసా? అని మండిపడ్డారు. అభివృద్ధి ఏ సూచికలు తీసుకున్నా జాతీయ స్థాయి కన్నా తెలంగాణ ముందుందని బండికి తెలియదా? అని ప్రశ్నించారు. పీఎం మోడీ ఓ ఫెయిల్యూర్ ప్రధాన మంత్రి అని, కేసీఆర్ ఏ అంశాల్లో సఫలం అయ్యారో అవే అంశాల్లో మోదీ విఫలమయ్యారన్నారు. జీడీపీ, జాతీయ తలసరి ఆదాయంలో మోదీ దేశాన్ని దిగజార్చారని ఆరోపించారు. ఎపుడు ఎన్నికలు వస్తాయో ప్రజలు ఎదురు చూస్తున్నారని బండి సంజయ్ అంటున్నారని, మునుగోడులో ఓటమి పాలైనా బీజేపీ బుద్ధి మారడం లేదన్నారు. అర్వింద్ తన తీరు మార్చుకోక పోతే ప్రజలు నిజామాబాద్లో ఉరికించి కొడుతారన్నారు. అరవింద్ ఇంట్లో మూడు పార్టీల వ్యక్తులు ఉన్నారని, కాంగ్రెస్తో కుమ్మక్కైనందువల్లే అర్వింద్ ఎంపీగా గెలిచాడన్నారు. అర్వింద్ భాష తీరుపై పౌర సమాజం, మీడియా సైతం స్పందించాలని మంత్రి వేముల అన్నారు.