హైదరాబాద్: బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) నాగర్ కర్నూల్ (Nagarkurnool) సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ప్రభుత్వంపై చేసిన అసత్య ఆరోపణలపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి (Minister Prashanth reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. నడ్డా.. ఇది కేసీఆర్ అడ్డా.. ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు కేంద్రం ఇచ్చిన గణాంకాలు నయా పైసాతో సహా వివరించినప్పటికీ.. కుక్కతోక వంకర అన్నట్లు పదేపదే అవే పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వచ్చిన ప్రతిసారీ తెలంగాణ (Telangana) అభివృద్ధిపై విషంచిమ్మే మాటలే చెబుతున్నారని, గుజరాత్ (Gujarat) గులాంలైన ఇక్కడి బీజేపీ నాయకులు రాసిచ్చిన పాత స్క్రిప్ట్నే ఎన్ని సార్లు చదువుతారని నిలదీశారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణంలో అవినీతి జరిగిందనడానికి సిగ్గుండాలన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇండ్లకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర సర్కారు పైసలు ఇవ్వనప్పటికీ.. అవార్డులు ఇస్తుందని తెలుసా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం కోసం రూ.12వేల కోట్లు ఖర్చు పెడితే.. కేంద్రం ఇచ్చింది రూ.1200 కోట్లు మాత్రమేనని తేల్చి చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రధాన మంత్రి అవాస్ యోజన (PMAY) పథకం ద్వారా పట్టణ ప్రాంతాలలో నిర్మిస్తున్న 1,59,372 ఇండ్లకు, ఒక్కో ఇంటికి రూ.1.5 లక్షల చొప్పున రూ.2,390 కోట్లు ఆర్థికసాయం చేస్తామని చెప్పినప్పటికీ.. రూ.1,201 కోట్లు మాత్రమే విడుదల చేశారన్నారు. అంటే ఇండ్ల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం ఖర్చుచేసిన డబ్బులో ఇది కేవలం 10 శాతం మాత్రమేనని తేల్చిచెప్పారు. హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్కోక్క ఇంటిని రూ.8,65,000 వ్యయంతో నిర్మిస్తుండగా పీఎంఏవై ద్వారా రూ.1.50 లక్షలు ఇస్తామని చెప్పి ఇప్పటి వరకూ సగం నిధులు మాత్రమే విడుదల చేశారని గుర్తు చేశారు.
కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు తెలంగాణ డబుల్ బెడ్ రూం ఇండ్ల పథకాన్ని ప్రశంసిస్తూ..
ప్రధాన మంత్రి అవార్డు, హడ్కో ఎక్సలెన్స్ 2018, హడ్కో ఎక్స లెన్స్ 2019, నిర్మాణాల్లో నూతన టెక్నాలజీ ఉపయోగించినందుకు ఉత్తమ రాష్ట్రంగా తెలంగాణకు 2020 సంవత్సరానికిగాను కేంద్ర గ్రామీణ, పట్టణాభివృద్ధి శాఖ ఎక్సలెన్స్ అవార్డు.. ఇలా పలు అవార్డులు, పురస్కారాలు అందజేశారని గుర్తుచేశారు.
తెలంగాణలో జాతీయ రహదారుల కోసం మోదీ ప్రభుత్వం కాగితాల మీద రూ.1.21 లక్షల కోట్లు మంజూరు చేసి తొమ్మిదేండ్లలో ఖర్చు చేసిందిమాత్రం రూ.19 వేల కోట్లేనని విమర్శించారు. అవి కూడా రాష్ట్ర ప్రజల నుంచి టోల్ట్యాక్స్, సెస్ల ద్వారా ముక్కు పిండి వసూలు చేసిన పైసలేనని స్పష్టం చేశారు. కాగితాల మీద మంజూరి లెక్కలు చెప్పి తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ నేతలు ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి డిమాండ్ చేశారు.
సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధును కాపీ కొట్టి పెట్టిన కేంద్రం.. కిసాన్ సమ్మాన్ నిధిలో రైతులకు కండీషన్లు పెట్టి రైతుల సంఖ్యను తగ్గించడం సిగ్గు చేటన్నారు. రాష్ట్రంలో రైతుబంధు పథకం ప్రారంభించినప్పుడు 49 లక్షల మంది రైతులు ఉండగా, నేడు లబ్ధిదారుల సంఖ్య 70 లక్షలకు చేరిందని తెలిపారు. ఎకరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక ప్రభుత్వమన్నారు. కేంద్రం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా 29 లక్షల మంది రైతులకు ఇప్పటివరకు రూ.9 వేల కోట్లు ఖర్చు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం 70 లక్షల మంది రైతులకు ఈ సీజన్ వరకు రూ.72 వేల కోట్లు ఖర్చు చేసిందని వివరించారు. రైతుల పట్ల ఎవరి చిత్తశుద్ది ఏంటో రాష్ట్ర, కేంద్ర గణాంకాలు చూస్తే అర్థమవుతుందన్నారు.