Minister Ponnam Prabhakar | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 18 (నమస్తే తెలంగాణ): ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్లు.. మంత్రి పొన్నం ప్రభాకర్తో చర్చల తర్వాత మరింత నిరాశలోకి వెళ్లారు. దాదాపు నలభై రోజులుగా తాము ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్న ఆశతో వెళ్తే ఆటో డ్రైవర్ అంటే ఎవరు? అన్న ప్రశ్న మంత్రి నోటి నుంచి రావడంతో ఆశ్చర్యపోయారు. కాంగ్రెస్ పార్టీ అనుబంధ ఆటో డ్రైవర్ల సంఘాల నాయకులతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం చర్చలు జరిపారు. సమావేశం మధ్యలో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయామని ప్రస్తావిస్తే ‘ఏం చేస్తే బాగుంటుందో మీరే చెప్పాలి’ అంటూ మంత్రి ఎదురు ప్రశ్నలు వేయడంతో ఆటో సంఘాల నాయకులు విస్తుపోయారు.
కాంగ్రెస్ మ్యానిఫెస్టో ప్రకారం ఏడాదికి రూ.12 వేలు చెల్లించడంపై చర్చ రావడంతో ‘ఆటో డ్రైవర్ అంటే ఎవరు? అందరూ ఆటో డ్రైవర్లమనే చెప్తారు? అందరికీ ఇవ్వడం ఎలా కుదురుతుంది?’ అని మంత్రి అనడంతో ఆటో యూనియన్ నాయకులు నీరుగారిపోయారు. ‘మరోసారి సమావేశం ఏర్పాటు చేసుకుందాం. అప్పుడు మళ్లీ అభిప్రాయాలు చెప్పండి. వాటిని నోట్ చేసుకొని చర్చిస్తాం’ అని మంత్రి అనడంతో రెండు గంటలకుపైగా జరిగిన సమావేశంలో ఏ సమస్యలతో వెళ్లారో, వాటికి జవాబులేకుండానే తిరిగొచ్చారు. చర్చల్లో ఎక్కడా కూడా ఆటో డ్రైవర్ల ఉపాధిపై పడిన దెబ్బపై మాట్లాడకుండా, కేవలం కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపర్చిన అంశాలు, హైదరాబాద్లో ఆటో పర్మిట్లు వంటి విషయాలపైనే చర్చించారని ఆటో సంఘాల నేతలు వాపోయారు. ఆటోడ్రైవర్ అంటే ఎవరో తెలియనిదే, ఎన్నికల్లో హామీ ఎలా ఇచ్చారని మండిపడుతున్నారు. ఎలాంటి హామీ లేకుండానే చర్చలు ముగియడంతో పైకి ఏమీ అనలేక, లోలోపల బాధతోనే బయటకు వచ్చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో సంఘాలను ఆహ్వానించకుండా కాంగ్రెస్ అనుబంధ సంఘాలనే చర్చలకు పిలవడమేమిటని టీఏటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆటో డ్రైవర్లకు నెలకు రూ.15 వేలు, ఆటోలో మహిళలకు ఉచిత ప్రయాణం ప్రవేశపెట్టి ఆదుకోవాలనే ప్రధాన డిమాండ్లపై చర్చల్లో మంత్రి ఎలాంటి హామీ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. చర్చలకు వెళ్లిన కాంగ్రెస్ అనుబంధ ఆటో యూనియన్ నాయకులు నిరాశగానే వెనుదిరిగారని చెప్పారు. ఆటో డ్రైవర్లందరి గురించి కాకుండా, కేవలం హైదరాబాద్లోని ఆటో డ్రైవర్లను పరిగణనలోకి తీసుకొని పర్మిట్లకు అనుమతిస్తామని మంత్రి చెప్పడం విడ్డూరంగా ఉన్నదని మారయ్య మండిపడ్డారు. నగరంలో మరోసారి ఆటో పర్మిట్లకు అనుమతులిచ్చి కమీషన్ దందాకు తెరలేపబోతున్నారని ఆరోపించారు.