Ponguleti Srinivas Reddy | హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): ఒక్క ఖమ్మం ఎంపీ టికెట్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రకంపనలకు తెరతీసింది. ఖమ్మం టికెట్ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వియ్యంకుడు రామసహాయం రఘురాంరెడ్డికి అధిష్ఠానం ఖరారు చేయడం పీసీసీలో చిచ్చు రేపింది. ఈ ఒక్క సీటుతో మంత్రి పొంగులేటి… సీఎం రేవంత్రెడ్డికి చెక్ పెట్టారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ సీటు విషయంలో మొదటి నుంచి ఎంతో పట్టుదలతో ఉన్న పొంగులేటి చివరికి తన పంతం నెగ్గించుకున్నారు. పొంగులేటి కుటుంబసభ్యులకు టికెట్ రాకుండా అడ్డుకోవడానికి సీఎం రేవంత్రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంతగానో ప్రయత్నించినట్టు పార్టీ అంతర్గత వర్గాల సమాచారం. అయినప్పటికీ వాళ్లందరి అభిప్రాయాన్ని కాదని అధిష్ఠానం పొంగులేటి వియ్యంకుడికి టికెట్ ఇవ్వడం రాష్ట్ర పార్టీలో సీఎం రేవంత్రెడ్డి ఏకఛత్రాధిపత్యానికి చెక్ పెట్టడమేనని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ పరిణామం సీఎం రేవంత్రెడ్డి రాజకీయ భవిష్యత్కు ఓ హెచ్చరిక లాంటిదనే చర్చ జోరుగా జరుగుతున్నది.
రేవంత్రెడ్డి గురి రివర్స్ అయిందా?
పొంగులేటి శ్రీనివాస్రెడ్డిని కాంగ్రెస్లోకి తీసుకురావడంలో సీఎం రేవంత్రెడ్డి కీలక పాత్ర పోషించారు. పార్టీలో తనకు కొరకరాని కొయ్యగా మారిన సీనియర్ నేత భట్టి విక్రమార్కకు చెక్ పెట్టేందుకే పొంగులేటిని తీసుకొచ్చారనే చర్చ అప్పట్లో జరిగింది. ఆ ప్రయత్నమే ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డికి రివర్స్ అయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనకు పోటీగా ఉన్న భట్టిని తప్పించాలని పొంగులేటిని తీసుకొస్తే.. ఇప్పుడు ఆయన భట్టిని మించి పోటీగా తయారయ్యారనే చర్చ జరుగుతున్నది. పొంగులేటిని పార్టీలో హైలెట్ చేయడం రేవంత్రెడ్డి చేసిన వ్యూహాత్మక తప్పిదమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో పొంగులేటి అడుగులను గుర్తించడంలో రేవంత్ విఫలమయ్యారనే చర్చ కూడా జరుగుతున్నది. అది తెలుకునేసరికే పరిస్థితి ‘చేయి’ దాటిపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
పొంగులేటి ‘భవిష్యత్తు’కు బాటలు !
పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కాంగ్రెస్లో చేరినప్పటి నుంచే తన ‘భవిష్యత్తు’కు బాటలు వేసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. అందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల్లో ‘తన’ వారికి టికెట్లు ఇప్పించి గెలిపించుకున్నారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ టికెట్ల విషయంలో తన రాజకీయ చతురతను ప్రదర్శించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు రాష్ట్రంలోనూ, అటు ఢిల్లీలోనూ బలంగా ఉండాలని ఆయన భావిస్తున్నట్టు తెలుస్తున్నది. ఇక్కడ పార్టీలో విధేయుడిగా ఉంటూనే.. ఢిల్లీకి గురిపెట్టారనే అభిప్రాయాలున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్న పొంగులేటి ఢిల్లీలోనూ తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకొనే పనిలో ఉన్నట్టు తెలిసింది. గతంలో ఎంపీగా పనిచేసిన అనుభవం, ఢిల్లీస్థాయిలో తన పరిచయాలు, పార్టీ అధిష్ఠానం వద్ద తన లాబీయింగ్, ఆర్థిక బలం ఇలా అన్నీ వినియోగించి ఎంపీ టికెట్ కోసం ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పినట్టు సమాచారం.
పొంగులేటి కుటుంబీకులకు టికెట్ వచ్చి ఢిల్లీకి వెళితే అసలుకే మోసం వస్తుందని భావించిన సీఎం రేవంత్, భట్టి, తుమ్మల సాధ్యమైనంత మేరకు అడ్డుకొనేందుకు ఆనేక ప్రయత్నాలు చేసినట్టు తెలిసింది. ఇందులో భాగంగానే మండవ వెంకటేశ్వరరావుతోపాటు మరికొందరి పేర్లను తెరపైకి తీసుకొచ్చారనే ప్రచారం జరిగింది. పార్టీలో కీలక నేతలంతా వ్యతిరేకిస్తున్నా… పొంగులేటి తన వాళ్లకు టికెట్ ఇప్పించుకోగలిగారు. ఇలా ఢిల్లీ స్థాయిలో చక్రం తిప్పడం వల్ల భవిష్యత్తులో రాష్ట్రంలో ఎలాంటి రాజకీయ పరిణామాలైనా జరిగేందుకు ఆస్కారం ఉందనే చర్చ జరుగుతున్నది. స్వతహాగా పెద్ద వ్యాపారవేత్త అయిన పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆర్థికంగా బలవంతుడనే విషయం అందరికీ తెలిసిందే. దీనికి తోడు వివిధ స్థాయిల్లో సంబంధాలు నెరపగల చాకచక్యం ఆయన సొంతం. ఇలాంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో ఏం జరుగుతుందోననే అనుమానాలు పార్టీ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.
రేవంత్ ఏకఛత్రాధిపత్యానికి గండి!
అటు అసెంబ్లీ ఎన్నికల్లో, ఇటు ఎంపీ ఎన్నికల్లో తాను సిఫారసు చేసిన అభ్యర్థులకు టికెట్లు ఇప్పించడంలో సీఎం రేవంత్రెడ్డి అనుకున్నది సాధించారనే అభిప్రాయాలున్నాయి. ఇందులో భాగంగానే మల్కాజిగిరి, చేవెళ్ల, భువనగిరి, వరంగల్, మెదక్, నాగర్కర్నూల్లో ‘తన’ అనుకున్నవారికి రేవంత్ టికెట్లు ఇప్పించుకున్నారనే అభిప్రాయాలున్నాయి. ఒక్క ఖమ్మం టికెట్ విషయంలోనే ఆయనకు భంగపాటు తప్పలేదని అంటున్నారు. ఈ ఒక్క సీటులో మాత్రం పొంగులేటి శ్రీనివాస్రెడ్డి రూపంలో రేవంత్రెడ్డికి చెక్ పడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో రేవంత్రెడ్డి ఏకఛత్రాధిపత్యానికి ఖమ్మం టికెట్ గండి కొట్టిందనే చర్చ పార్టీలో జోరుగా జరుగుతున్నది. ఇది భవిష్యత్తులో ఎక్కడికి దారితీస్తుందోనని పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.