ఖమ్మం: కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలను తొలి మంత్రివర్గ సమావేశంలోనే ఆమోదించామని, దాంతోనే తమ ప్రభుత్వ చిత్తశుద్ధి కనిపిస్తున్నదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించామని చెప్పారు. ఖమ్మం గ్రామీణ మండలం మంగళడూడెంలో నిర్వహించిన ప్రజాపాలన సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామన్నారు. మాటలు కాదు.. చేతల్లో చూపించాలనే నిబద్ధతో పనిచేస్తున్నామని తెలిపారు. ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకు రోజుకు 16 గంటలపాటు చిత్తశుద్ధితో పని చేస్తున్నామని వెల్లడించారు.