Minister Srinivas Reddy | కాళోజీ కళాక్షేత్రం పనులను వేగవంతంగా పూర్తి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హనుమకొండ బాలసముద్రంలో నిర్మిస్తున్న కాళోజీ కళాక్షేత్రాన్ని మంత్రి కొండ సురేఖతో కలిసి ఆయన శనివారం పరిశీలించారు. కళాక్షేత్రంలో నిర్మిస్తున్న ఆర్ట్ గ్యాలరీ, ఆడిటోరియాన్ని సందర్శించారు. నిర్మాణ పనులపై అధికారులు మంత్రులకు వివరించారు.
కాలేజీ కళాక్షత్రానికి సంబంధించిన మ్యాప్ను మంత్రులు పరిశీలించారు. కాళోజీ కళాక్షేత్రం నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మంత్రుల వెంట ప్రభుత్వ విప్ రామ్ చంద్రనాయక్, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, వరంగల్ మున్సిపల్ కమిషనర్ రిజ్వాన్ భాషా షేక్, అదనపు కలెక్టర్ రాధిక గుప్తా, ట్రైనీ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, కుడా అధికారులు అజిత్ రెడ్డి పాల్గొన్నారు.
అంతకు ముందు రాంపూర్ శివారులో ఉన్న ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సర్కిల్ వద్ద రోడ్డును మంత్రులు పరిశీలించారు. వరంగల్ రోడ్డు మార్గం తెలియక వాహనదారులు ఇబ్బందులుపడుతున్నారని అభిప్రాయం వ్యక్తం కావడంతో మంత్రులు జాతీయ రహదారి ప్రాంతాన్ని సందర్శించి.. మ్యాప్లను పరిశీలించారు. లోపాలను సవరించేందుకు సమగ్ర వివరాలతో నివేదికను సిద్ధం చేయాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులకు, కుడా అధికారులను ఆదేశించారు.