Secretariat | హైదరాబాద్, ఫిబ్రవరి 22 (నమస్తే తెలంగాణ): ఉదయం 11.40 దాటినా ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయని, ఉద్యోగులు ఇంకా విధులకు హాజరుకాకపోవడమేంటి? అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. సచివాలయంలోని రెవెన్యూ ఉద్యోగుల పనితీరును పరిశీలించేందుకు మంత్రి గురువారం ఉదయం 11:30 గంటలకు ఆ విభాగానికి వెళ్లారు.
అక్కడి పరిస్థితిని చూసి విస్మయం వ్యక్తంచేశారు. ఐదు సెక్షన్లలో చాలా కుర్చీలు ఖాళీగానే దర్శనమిచ్చాయి. హాజరు పట్టికలను పరిశీలించి, అధికారులను ఆరా తీయగా.. ఉద్యోగులు ఇంకా హాజరు కాలేదని తేలింది. ఇందులో కొందరు కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఆఫీసుకు రాకపోవడంతో మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘11:40 గంటలకు కూడా ఉద్యోగులు విధులకు రాకపోవడం బాధ్యతారాహిత్యమే. దీన్ని సహించేది లేదు’ అని హెచ్చరించారు. విధులకు హాజరుకాని వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.