అమీర్పేట్, జూలై 22 :బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో చివరి ఘట్టమైన అమ్మవారి రథోత్సవం బుధవారం సాయంత్రం ఘనంగా జరిగింది. దీంతో మూడు రోజుల పాటు జరిగిన ఎల్లమ్మ అమ్మవారి కల్యాణోత్సవాలు ముగిశాయి. రథోత్సవంలో సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ పాల్గొన్నారు. చక్కటి పూలతో అలంకరించిన రథంపై ప్రతిష్ఠించిన అమ్మవారికి ఎమ్మెల్యే తలసాని, దేవాలయ ఛైర్మన్ కొత్తపల్లి సాయిగౌడ్, ఈవో వినోద్రెడ్డిలతో కలిసి పూజలు నిర్వహించి రథాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని మాట్లాడుతూ అమ్మవారి కల్యాణోత్సవానికి వివిధ విభాగాల అధికారులతో పాటు రాజకీయాలకు అతీతంగా బల్కంపేట వాసులంతా ఒక్కటై విజయవంతం చేశారన్నారు. అమ్మవారు చల్లగా చూడడం వల్ల వర్షాలు ప్రారంభమయ్యాయని, రాష్ట్రం సుభిక్షంగా ఉండేలా చూడాలని కోరుకున్నట్టు తెలిపారు. అయితే ఎప్పటిలాగే రథోత్సవం ప్రారంభమైన కొద్ది సేపటికే భారీ వర్షం ప్రారంభమైంది. వర్షంలోనే విద్యుత్ కాంతుల మధ్య అమ్మవారి రథాన్ని ముందుకు కదిలించారు.
పోతరాజుల నృత్యాలు, డప్పు చప్పుళ్లు, మంగళ వాయిద్యాల మధ్య ముందుకు కదులుతున్న అమ్మవారి రథోత్సవంలో భక్తులు పెద్దసంఖ్యలో భాగస్వాములయ్యారు. ఇదిలా ఉంటే అమ్మవారి రథానికి స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన వేదికల వద్ద నిర్వాహకులు ఏర్పాటు చేసుకున్న డీజే చప్పుళ్లను పోలీసులు నిలిపివేయించారు. బల్కంపేట రహదారులపై ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా డీసీపీ రమణారెడ్డి నేతృత్వంలో ఏసీపీ రాఘవేంద్రరావు, ఎస్ఆర్నగర్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్రెడ్డిలు అడుగడుగునా బందోబస్తు ఏర్పాటు చేశారు.

అమ్మవారికి బంగారు బోనం
అమీర్పేట్, జూలై 22 :పాతబస్తీలోని ఉమ్మడి దేవాలయాల కమిటీ బుధవారం ఉదయం బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారికి బంగారు బోనం సమర్పించుకుంది. కమిటీ అధ్యక్షుడు మధుసూధన్ యాదవ్ ఆధ్వర్యంలో డప్పు చప్పుళ్లు, పోతరాజు నృత్యాలతో బోనం సమరించేందుకు ఎల్లమ్మ ఆలయానికి తరలివస్తున్న కమిటీ ప్రతినిధులకు సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కోలన్ బాల్రెడ్డి, ఎం.హనుమంతరావు, దాడి ప్రవీణ్రెడ్డి, వడ్డె కరుణాకర్రెడ్డి, కట్టా బలరాం, రాజేష్ ముదిరాజ్, వనం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
మరుగుజ్జుల నృత్యాలు..
బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కూతురు నర్సింహ ఆధ్వర్యంలో ఎల్లమ్మ అమ్మవారి రథానికి స్వాగతం పలికేందుకు ఏర్పాటు చేసిన స్వాగత వేదిక ఆకట్టుకుంది. పోతరాజుల వేషాల్లో మరుగుజ్జులు చేసిన నృత్యాలు వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు కూతురు క్రిష్ణ, కూతురు శ్రీధర్, కూతురు రవి, కూతురు మల్లికార్జున్, కూతురు కార్తిక్ తదితరులు భక్తులకుమ ప్రసాదాన్ని పంపిణీ చేశారు.
