Minister KTR | హైదరాబాద్, జూన్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో సమగ్ర, సమీకృత, సమ్మిలిత, సమతుల్య అభివృద్ధి జరుగుతున్నదని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. పిల్లలకు చిన్ననాటి నుంచే స్వచ్ఛతపై అవగాహన కల్పించడానికి ప్రతి మున్సిపాలిటీలో ఒక స్వచ్ఛ బడిని రూ.71 కోట్లతో ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. వీటితోపాటు మినీ స్టేడియం, వృద్ధ్దాశ్రమం కూడా ఏర్పాటు చేస్తామని, మూసీనది పనులను పూర్తి చేస్తామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురసరించుకొని శుక్రవారం హైదరాబాద్ శిల్పకళా వేదికలో నిర్వహించిన పట్టణ ప్రగతి సంబురాల్లో మంత్రులు కేటీఆర్, వీ శ్రీనివాస్గౌడ్ పాల్గొన్నారు. మున్సిపల్ శాఖ తొమ్మిదేండ్లలో సాధించిన అభివృద్ధి కార్యక్రమాల నివేదికను ఆవిష్కరించారు.
అనంతరం సఫాయి కార్మికులను శాలువాతో సన్మానించారు. చీర, నగదు బహుమతులు అందజేశారు. వివిధ క్యాటగిరీల్లో పట్టణ ప్రగతి అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకత్వంలో పురపాలనలో దేశంలోనే అద్భుతమైన ప్రగతి సాధించిన రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. 2022-23 సంవత్సరానికి మున్సిపల్ శాఖ 26 అవార్డులను సాధించిందని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛ సర్వేక్షణ్తోపాటు రాష్ట్ర మున్సిపల్ శాఖ కార్యక్రమాలకు ఇచ్చిన అనేక అవార్డులు, ప్రశంసలే ఇందుకు నిదర్శనమని చెప్పారు.
పల్లెలు దేశానికి పట్టుగొమ్మలు అని మహాత్మాగాంధీ చెప్పిన మాట ఎంత వాస్తవమో, పట్టణాలు దేశానికి ఆర్థిక ఇంజిన్లు అనడం అంతే వాస్తవమని కేటీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం 45 నుంచి 50% హైదరాబాద్, దాని చుట్టుపకల ఉన్న పట్టణాల నుంచే వస్తున్నదని వెల్లడించారు. నివాసయోగ్య నగరాల్లో హైదరాబాద్ నగరం దేశంలో ముందున్నప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా 142వ స్థానంలో ఉన్నదని ప్రపంచస్థాయిలో మెరుగైన ర్యాంకు సాధించాలంటే అనేక కార్యక్రమాలు చేపట్టాల్సి ఉన్నదని తెలిపారు. గత తొమ్మిదేండ్లలో పట్టణాలు, నగరాల అభివృద్ధికి రూ.16 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. పని చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తారని, మూడోసారి కేసీఆర్ ప్రభుత్వమే రాబోతున్నదని చెప్పారు.
ప్రజలే కేంద్ర బిందువుగా పరిపాలనా సంసరణలు, పథకాలను తీసుకొస్తేనే పాలన విజయవంతం అవుతుందన్న విశ్వాసం ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. సీఎం ఆలోచన మేరకే అనేక పరిపాలనా సంసరణలు, నూతన పురపాలక, పంచాయతీరాజ్ చట్టాలు, టీఎస్ బీపాస్ వంటి నూతన భవన నిర్మాణాలకు అనుమతుల ప్రక్రియను తీసుకొచ్చామని వివరించారు. రాష్ట్రంలో ఐటీ నుంచి అగ్రికల్చర్ వరకు అన్ని రంగాల్లోనూ అద్భుతమైన అభివృద్ధి సాధ్యమవుతున్నదని చెప్పారు.
నెల వ్యవధిలోనే విజయవంతంగా హైదరాబాద్లో 150 వార్డుల్లో వార్డు కార్యాలయ వ్యవస్థను ప్రారంభించి జీహెచ్ఎంసీ ప్రజల పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నదని మంత్రి కేటీఆర్ అభినందించారు. మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో కూడా వార్డు కార్యాలయాలను ప్రారంభిస్తామని చెప్పారు. వార్డు కార్యాలయాలను అధ్యయనం చేసేందుకు ఇతర రాష్ర్టాలవారు వస్తారని చెప్పారు. దేశంలో అత్యధిక వేతనం అందుకుంటున్న పారిశుద్ధ్య కార్మికులు తెలంగాణలో ఉడటం గర్వకారణమని చెప్పారు. ప్రతి నెలా మౌలిక వసతుల ఏర్పాటు, నిర్వహణ కోసం పట్టణ ప్రగతి కింద రూ.4,537 కోట్ల నిధులు విడుదల చేస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ కార్పొరేషన్, పౌర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను చేపట్టేందుకు పట్టణాలకు రూ.4,706 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించామని తెలిపారు. తొలి దశ అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా రూ.7,100 కోట్లతో పట్టణాలకు తాగునీరు అందిస్తున్నామని చెప్పారు. హైదరాబాద్లో ఈ సెప్టెంబర్ నాటికి 100 శాతం మురికినీటిని శుద్ధి చేసే ఏర్పాట్లు చేస్తున్నామని, ఈ ఘనత సాధించిన తొలి నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టిస్తుందని పేర్కొన్నారు. మూసీనదిపై 14 బ్రిడ్జిలను నూతనంగా నిర్మిస్తామని చెప్పారు. మూసీ ప్రాజెక్టు పనులను కేసీఆర్ ప్రభుత్వమే వచ్చే టర్మ్లో పూర్తి చేస్తుందని అన్నారు.
పట్టణాల్లో గతంలో నీటి కొరత, ట్యాంకర్ల కొరత, రకరకాల సమస్యలు ఉండేవని, ఇప్పుడు ఆ సమస్యలు లేవని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. గతంలో మున్సిపల్ సఫాయి కార్మికులకు మూడు నెలలకు ఒకసారి కూడా జీతాలు వచ్చేవి కావని గుర్తు చేశారు. మున్సిపల్ కమిషనర్ లాంటి పోస్టులు చాలా ఒత్తిడితో కూడుకున్నవని చెప్పారు. కార్యక్రమంలో ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్శర్మ, ప్రభుత్వ విప్లు బాల్క సుమన్, అరికెపూడి గాంధీ, ఎమ్మెల్యే ఉపేందర్రెడ్డి, కాలే యాదయ్య, బాపురావు, మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సుదర్శన్రెడ్డి, సీడీఎంఏ ఎన్ సత్యనారాయణ, జలమండలి ఎండీ దానకిశోర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, మున్సిపల్ శాఖ అడిషనల్ సెక్రటరీ వీ సైదా, మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగుతున్నాయి. శుక్రవారం నిర్వహించిన పట్టణ ప్రగతి ఉత్సవాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. పట్టణ పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను మంత్రులు, ప్రజాప్రతినిధులు శాలువాలతో సత్కరించారు. మహిళా స్వయం సహాయక సంఘాలకు మంజూరైన చెక్కులు, పారిశుద్ధ్య కార్మికులకు కిట్లు అందజేశారు. పలు పట్టణాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గత తొమ్మిదేండ్లలో సాధించిన ప్రగతిని వివరించారు.
ఆయా నగరపాలక సంస్థలో వినియోగిస్తున్న వాహనాలను అందంగా అలంకరించి, మేళతాళాలు, బోనాలు, బతుకమ్మలతో భారీ ర్యాలీలు నిర్వహించారు. పలు పట్టణాల్లో మున్సిపల్ సిబ్బంది, ఉద్యోగులు మానవహారాలు నిర్మించారు. వనపర్తిలో జడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ సఫాయి కార్మికుల కాళ్లు కడిగారు. వరంగల్లో సఫాయి కార్మికుల విగ్రహాలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్, మేయర్ గుండు సుధారాణి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, కమిషనర్ షేక్ రిజ్వానా బాషా, సీపీ ఏవీ రంగనాథ్ ఆవిష్కరించారు.