Crop Loan | హైదరాబాద్ : స్థంభించిన రైతుల బ్యాంకు ఖాతాలకు కూడా రుమాఫీ లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. 2018 డిసెంబర్ 11 నాటికి ప్రతి కుటుంబానికి రూ.లక్ష వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నదని తేల్చిచెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల ప్రకారం రైతుల రుణ ఖాతాలకు ఈ నిధుల విడుదల ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రభుత్వం ప్రకటించిన విధంగా నిర్దేశిత సమయంలో రుణమాఫీ ప్రక్రియ పూర్తవుతుంది. ఇప్పటివరకు ప్రభుత్వం 16 లక్షల 65, 656 మంది రైతుల ఖాతాలకు రూ.8089.74 కోట్లను విడుదల చేసింది. డిసెంబర్ 11, 2018 వరకు రూ.లక్ష ఆ పైన ఎంత వరకు రుణాలు ఉన్నా కూడా ఆయా రైతు కుటుంబాలకు రూ.లక్ష వరకు పంట రుణమాఫీ ప్రక్రియ వర్తిస్తుందని నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు.
రుణమాఫీ పథకం కింద అర్హులైన రైతుల డేటాబేస్ 2020 సంవత్సరంలో తయారు చేయబడింది.. బ్యాంకుల విలీన ప్రక్రియ మూలంగా ఈ విషయంలో రైతుల ఖాతాల వివరాలు మారడం మూలంగా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయని మంత్రి తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థల ఖాతాలు మార్చులు, చేర్పులు తరచుగా జరుగుతుంటాయి. అప్పటి నుండి ఖాతా నంబర్లు మరియు IFSC కోడ్లను అప్డేట్ చేయడానికి బ్యాంకర్లకు 3 సార్లు డేటా ఇవ్వడం జరిగింది.. వాటిని తిరిగి అప్ డేట్ చేయడం జరిగింది.
రైతులకు సంబంధించిన పూర్తి వివరాలు ప్రభుత్వం వద్ద అందుబాటులో ఉన్నాయి. ఏ కారణం చేత బ్యాంకు ఖాతాలు మూసుకుపోయినా, ఖాతా నంబరు మారినా రుణమాఫీ కావాల్సిన రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. స్థంబించిన ఖాతాలు, డిబిటి ఫెయిల్ అయిన ఖాతాలు ఉన్న రైతులు కూడా క్రాప్ లోన్ మొత్తాన్ని అందుకుంటారని మంత్రి పేర్కొన్నారు.
వాస్తవ లబ్ధిదారులు రుణ మాఫీ మొత్తాలను పొందేలా చేసేందుకు ప్రభుత్వం పని చేస్తున్నదని నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ కుబేర్ సాంకేతిక వ్యవస్థలో దీనికి సమాచారం అంతా నిక్షిప్తమై ఉన్నది.. ఆయా లబ్దిదారులకు ఎలాంటి ఇబ్బందిలేకుండా రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. రుణమాఫీ ప్రక్రియపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని మంత్రి స్పష్టం చేశారు.