హైదరాబాద్, ఏప్రిల్ 30(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో నకిలీ విత్తనాల మాటే వినిపించకూడదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి స్పష్టం చేశారు. నకిలీ విత్తన తయారీదారులు, విక్రేతలపై ఉక్కుపాదం మోపాలని పోలీసు, వ్యవసాయ అధికారులను ఆదేశించారు. నకిలీ విత్తనాల విక్రయాలను అడ్డుకొనేందుకు ప్రత్యేక టాస్క్ఫోర్స్ బృందాలను ఏర్పాటుచేసి ఎక్కడిక్కడ విస్తృత తనిఖీలు చేపట్టాలన్నారు. నకిలీ విత్తనాలకు సంబంధించిన కేసుల విచారణకు ప్రత్యేకంగా ఫాస్ట్ట్రాక్ కోర్టుల ఏర్పాటు అంశాన్ని పరిశీలిస్తున్నట్టు తెలిపారు.
ఈ మేరకు రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ అలీతోపాటు జిల్లాల ఎస్పీలు, డీఏవోలు, ఏవోలతో కలిసి శనివారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రధానంగా పత్తి, మిరప పంటల్లోనే నకిలీ విత్తనాల సమస్య ఉన్నదని మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొంటూ.. ఈ రెండు పంటలు ఎక్కువగా సాగుచేసే ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాలని సూచించారు. కలుపు కూలి ఖర్చులు తప్పుతాయనే ఉద్దేశంతో చాలా మంది రైతులు నిషేధిత హెచ్టీ కాటన్ విత్తనాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారని, ఈ నేపథ్యంలో కలుపు నివారణకు ఉపయోగించే ైగ్లెపోసెట్ మందు అమ్మకాలపై నిఘా పెట్టాలని ఆదేశించారు.
తనిఖీల పేరుతో వ్యాపారులను ఇబ్బంది పెట్టవద్దని, అన్ని వివరాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కేసులు నమోదు చేయాలని తెలిపారు. లైసెన్స్ లేని విత్తన వ్యాపారులతోపాటు కాలం చెల్లిపోయిన విత్తనాలను విక్రయించేవారిపై చర్యలు చేపట్టాలన్నారు. విత్తన ప్యాకెట్లపై సరైన పేరు, గడువు తేదీలు, బార్కోడ్ సరిగ్గాలేని విత్తనాలను కొనుగోలు చేయవద్దని రైతులకు సూచించారు. ముఖ్యంగా గ్రామాల్లోకి వచ్చి ఎలాంటి బిల్లులు ఇవ్వకుండా విక్రయించే వారి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ విత్తనాలు కొనుగోలు చేయవద్దన్నారు. ఇలాంటి వారు ఎవరైనా వస్తే వెంటనే పోలీసులకు లేదా వ్యవసాయ అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. సమావేశంలో డీజీపీ మహేందర్రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్రావు, సీపీలు మహేశ్భగత్, స్టీఫెన్ రవీంద్ర, ఐజీలు నాగిరెడ్డి, డీఎస్ చౌహాన్, ఏడీజీ ఇంటలీజెన్స్ అనిల్ కుమార్, ఇంటెలిజెన్స్ ఐజీపీ రాజేశ్, వ్యవసాయ శాఖ ప్రత్యేక కమిషనర్ హన్మంతు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు పాల్గొన్నారు.