బల్మూర్/ నాగర్ కర్నూల్ : కరోనా విజృంభిస్తున్న తరుణంలో గ్రామీణ ప్రాంత ప్రలకు మెరుగైన వైద్యం అందించేందుకు అమెరికన్ తెలంగాణ సొసైటీ (ఏటీఎస్), తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టీటా) తమ వైద్య సేవా కార్యక్రమాలను వేగంగా ముందుకు తీసుకుపోతున్నాయి. కరోనా నిర్ధారణ పరీక్షలు, వ్యాధిగ్రస్తులు చికిత్స పొందే సమయంలో సమస్యలు ఎదుర్కుంటున్న వారి కోసం రాష్ట్ర మంతటా కొవిడ్ దవాఖానలు ఏర్పాటు చేసేందుకు ఈ సంస్థలు ముందుకొస్తున్నాయి.
కాగా, నారాయణపేట జిల్లా మాగనూరులో తొలి దవాఖానను గత నెల ప్రారంభించారు. టీటా ఆధ్వర్యంలో విజయవంతంగా సేవలు అందిస్తున్న ఈ దవాఖానకు కొనసాగింపుగా నేడు నాగర్ కర్నూల్ జిల్లా బల్మూరులో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి మరో కొవిడ్ దవాఖానను ప్రారంభించారు. టీ.కన్సల్ట్ ద్వారా మంత్రి నిరంజన్ రెడ్డి తొలి అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. హెల్త్ కేర్ లో టెక్నాలజీ ఎలా వినియోగించుకోవచ్చో టీటా నిరూపిస్తుందని ప్రశంసించారు. టీటా గ్లోబల్ ప్రెసిడెంట్ సందీప్ మక్తాల ఆధ్వర్యంలో పల్లెసీమల్లో సేవ చేసేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. బల్మూర్ మండల వాసులు కొవిడ్ దవాఖాన సేవలు వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.
టీటా గ్లోబల్ ప్రెసిడెండ్ సందీప్ మక్తాల మాట్లాడుతూ..మరిన్ని కోవిడ్ దవాఖనలు ఏర్పాటు చేస్తామన్నారు. మాగనూర్ లో ఏర్పాటు చేసిన మొదటి కొవిడ్ దవాఖన విజయవంతంగా సేవలు అందిస్తున్నదని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాగర్కర్నూల్ ఎంపీ పి. రాములు, ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు, దాత మాధవరం రంగారావు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత మృతి
బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్న కవితా సంకలనం ఆవిష్కరణ
సొంత జాగాల్లోనే డబుల్ బెడ్ రూం ఇండ్లు : మంత్రి హరీశ్ రావు
సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ను కలిసిన మంత్రి తలసాని