కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయ రంగంపై తీసుకున్న నిర్ణయాల వల్ల రాష్ట్ర వృద్ధి రేటు గణనీయంగా పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Niranjan reddy) తెలిపారు. గురువారం కరీంనగర్ పట్టణంలో మార్క్ ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ను మంత్రి గంగుల కమలాకర్(Gangula Kamalakar) తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు వ్యవసాయంపై రూ. 3.50 లక్షల కోట్లు ఖర్చు చేశామని, ఈ రంగం అభివృద్ధి చెందిన కారణం గానే రాష్ట్రం అభివృద్ధిని సాధించగలిగిందన్నారు. కేసీఆర్(KCR) కంటే భిన్నంగా ఈ దేశంలో ఏ నాయకుడు ఆలోచించ లేడని పేర్కొన్నారు. 2014 యాసంగిలో కేవలం 28.18 లక్షల ఎకరాల్లో మాత్రమే రాష్ట్రంలో పంటలు సాగు కాగా ఈ యాసంగిలో 68.08 లక్షల ఎకరాల్లో సాగైందని చెప్పారు. అప్పటికి ఇప్పటికి 40 లక్షలకుపైగా ఎకరాల్లో సాగు విస్తీర్ణం పెరిగిందన్నారు.
కేసీఆర్ పాలసీలకు భిన్నంగా ఏం చేస్తారో చెప్పకుండా కొందరు పాదయాత్రల్లో వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకించిన వాళ్లకు ఇది అర్థం కాదని, చేతకాని నేతలు సభలు, పాదయాత్రలు చేస్తూ నిరాధార ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మూడోసారిమళ్లీ ముఖ్యమంత్రిగా కేసీఆరేనని ధీమాను వ్యక్తం చేశారు.
మార్క్ఫెడ్(Markfed) ఆస్తులను పెంచుకునేందుకు ఇలాంటి పెట్రోలు బంకు ఏర్పాటు చేయడం సంతోషకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, మార్క్ ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డి, టీస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, మార్క్ ఫెడ్ ఎండీ ఎండీ యాదిరెడ్డి, కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తదితరులు పాల్గొన్నారు.