హైదరాబాద్: రైతులకు సాయంపై కాంగ్రెస్, బీజేపీలు చిల్లర రాజకీయాలు చేస్తున్నాయని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో పోరాడి అసువులుబాసిన రైతులకు అండగా నిలవాల్సిన అవసరముందని చెప్పారు. రైతుల పోరాట ఫలితంగానే ప్రధాని మోదీ సాగు చట్టాలను వెనక్కి తీసుకున్నారని తెలిపారు. రైతు కుటుంబాలకు సాయం చేస్తున్న కేసీఆర్ను అభినందించాల్సిందిపోయి విమర్శించడం సిగ్గుచేటన్నారు. రైతులకు సాయంలపై విపక్షాల విమర్షలను మంత్రి నిరంజన్ రెడ్డి ఖండించారు.
రైతుబీమా పథకం ప్రపంచంలో ఎక్కడా లేదని మంత్రి వెల్లడించారు. తెలంగాణలో ఇప్పటివరకు 80 వేల 755 కుటుంబాలకు రైతుబీమా అందించామన్నారు. కాగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతుబీమా పథకం అమలు చేసే దమ్ముందా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ రైతు పక్షపాతి అని చెప్పారు.
కాంగ్రెస్ను ప్రజలు నమ్మడమంటే గొర్రె కసాయివాడిని నమ్మినట్లేనని ఎద్దేవా చేశారు. దశాబ్దాల పాలనతో విసుగుచెందిన ప్రజలు ఆ పార్టీని పక్కన పెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్, బీజేపీలు పగటికలలు కంటున్నాయన్నారు.