హైదరాబాద్ : రాష్ట్ర, దేశ చరిత్రలో సీఎం కేసీఆర్ నిలిచిపోతారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం వనపర్తిలో టీఆర్ఎస్ బహిరంగ సభ జరిగింది. సమావేశానికి సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవగా.. సభకు నిరంజన్రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రికి జన్మనిచ్చిన తల్లిదండ్రులు ధన్యులన్నారు. ఆణిముత్యంలాంటి బిడ్డను తెలంగాణకు అందించినందుకు ఆయన మాతృమూర్తికి మహిళా దినోత్సవం సందర్భంగా శిరస్సు వహించి ప్రణమిల్లుతున్నానన్నారు. తనతల్లితో పాటు మహిళలందరికీ ప్రపంచ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ విముక్తితో పాటు పునరుజ్జీవాన్ని సీఎం కేసీఆర్ బతుకమ్మలా ఎత్తుకున్నారని, నదుల నీళ్లతో నేలపాదాలను అభిషేకం చేసిన అపర భగీరథుడని కొనియాడారు. తెలంగాణ జన శేఖరుడు చంద్రశేఖరుడని, ఆయన మందారపు చేతులతో నూతన జిల్లాగా వనపర్తి పురుడు పోసుకొని.. ఇవాళ పున్నమి వెన్నెలై నవ్వుతుందన్నారు. సీఎం కేసీఆర్ పచ్చని పంటలు పబ్బతిపడుతున్నాయన్నారు. మూడేళ్ల క్రితం వనపర్తి ఎన్నికల బహిరంగ సభలో ఇచ్చిన మాట మేరకు హామీలన్నీ నెరవేర్చి ఈ నేలపై అడుగుపెట్టారనీ, జిల్లాను చేయడంతో పాటు మెడికల్ కాలేజీ మంజూరు చేసి, ప్రభుత్వ జేఎన్టీయూ ఇంజినీర్ కళాశాల, నర్సింగ్ కళాశాలలను మంజూరు చేశారన్నారు.
శరవేగంగా పనులు పూర్తయి.. కళ్ల ముందు సాక్షాత్కరిస్తున్నాయని పేర్కొన్నారు. దశాబ్దాలుగా వనపర్తి వాసులు ఎదురు చూస్తున్న రహదారుల విస్తరణ ఒక కలగా ఉండేదని, దాన్ని అమృత హస్తాలతో నిజం చేశారన్నారు. ఇవాళ ఈ ప్రాంత వాసులు అదృష్టవంతులనీ, కాకతీయుల కాలంలో నిర్మించిన ఘనపుసముద్రం శిథిలావస్థకు చేరితే.. దాన్ని పునరుద్ధరణకు పూనుకున్నారన్నారు. కాకతీయ రెడ్డిరాజులు ఎలా చరిత్రలో నిలిచారో అంతకు ఘనమైన కీర్తితో సీఎం కేసీఆర్ తెలంగాణ చరిత్ర, దేశ చరిత్రలో నిలువడం ఖాయమన్నారు. ఒకప్పుడు వయ్యారి భామలు.. లొట్టపీస్ చెట్లకు నిలయమైన భూముల్లో నేడు బంగారు పంటలు పండుతున్నాయని, కేసీఆర్కు ఇతరలకు ఉన్న తేడా అదేనన్నారు.
తెలంగాణ రాష్ట్రానికి, సమైక్య రాష్ట్రానికి ఉన్న తేడా అదేనని, ఇంచు ఇంచు భూమి ఎక్కడా ఖాళీగా లేదని, అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రజల జీవన ప్రమాణాలు కొట్టొచ్చినట్లు మార్పులతో కనిపిస్తున్నాయన్నారు. ప్రతి ఒక్కరిలో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతున్నదని, ఈ మార్పు సీఎం కేసీఆర్తోనే సాధ్యమైందని, అందుకు శిరస్సు వంచి ధన్యవాదాలు అర్పిస్తున్నానన్నారు. సీఎం పోరాటమే దీనికి కారణమని, ఆయన వెంట అడుగులు వేసినందుకు.. ఈ జీవితానికో ఇదో గొప్ప తృప్తి అన్నారు. మిగతా పనులు కూడా ప్రజలకు అడిగేదానికన్నా ముందే చేసే దక్షత, ఆలోచన సీఎం కేసీఆర్కు ఉన్నదని.. అవే తమకు అలవడిందన్నారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో దేశంలోనే తలమానికమైన జిల్లాల సరసన వనపర్తిని చేర్చే బాధ్యత మాదని విశ్వాసం కల్పిస్తున్నానన్నారు.