సిద్ధిపేట : తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు ఆరోపించారు. సిద్ధిపేట జిల్లా కుకునూర్పల్లి మండల కేంద్రంలో కొత్తగా నిర్మించిన తహసీల్దార్ కార్యాలయం, జాయింట్ సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి.. బీజేపీ, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల్లో ఎందుకు జరుగడం లేదని ప్రశ్నించారు.
తెలంగాణకు ఎఫ్ఆర్బీఎం కింద రూ.15వేల కోట్లు, బోరుబాయిల కాడ మీటర్లు పెట్టలేదని తెలంగాణకు రావాల్సిన రూ.6వేలకోట్లను బీజేపీ కక్షతో నిలిపివేసిందని మండిపడ్డారు. రైతన్నల కోసం రాష్ట్రానికి రావాల్సిన రూ.6వేలకోట్లను సీఎం కేసీఆర్ వదులుకున్నారని తెలిపారు. నూతనంగా ఏర్పాటైన కుకునూర్పల్లి మండల కేంద్రంలో కొత్త ఇంటిగ్రేటెడ్ మండల ఆఫీస్ను ఏర్పాటు చేస్తామని, వచ్చే జనవరి – ఫిబ్రవరి వరకు కుకునూరుపల్లికి రాలు రాబోతుందన్నారు. కుకునూరుపల్లికి రైలు వస్తే తిరుపతికి వెళ్లొచ్చని, కరీంనగర్, హైదరాబాద్ నగరాలకు వెళ్లవచ్చన్నారు.
కొత్తగా ఏర్పాటైన మండలాభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఇవాళ కుకునూరుపల్లి ప్రజల కళ్లల్లో బతుకమ్మ, దసరా పండుగ కలిసి వస్తే ఎంత సంతోషం ఉంటుందో.. అంత సంతోషి చూస్తున్నామన్నారు. ఆడపిల్లల చదువు కోసం ప్రతి మండలానికి రెసిడెన్సియల్ స్కూల్ ఏర్పాటు చేశామని, ఆడ పిల్లలకు సిద్ధిపేట, జగదేవపూర్, గజ్వేల్లో మహిళా డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలతో బాల్య వివాహాలు ఆగాయన్నారు.
వరి ధాన్యం కొనుగోలు చేసి రెండు రోజుల్లోనే డబ్బులు అందిస్తున్నామని, యాసంగిలో గుంట ఎండకుండా రెండు పంటలకు కాళేశ్వరం నీళ్లను అందిస్తున్నట్లు వివరించారు. ఇక నుంచి స్థల రిజిస్ట్రేషన్ కోసం కొండపాక, గజ్వేల్ వెళ్లాల్సిన పని లేదన్నారు. కుకునూరుపల్లిలోనే రిజిస్ట్రేన్లు ఉంటాయని, అన్ని హంగులతో కుకునూరుపల్లి మండలాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.