తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలను అమ్మేందుకు కేంద్రం ప్రయత్నం యత్నిస్తోందని, వీటికి రాష్ట్ర సర్కారు కేటాయించిన భూముల విలువ సుమారు రూ. 40వేల కోట్ల వరకూ ఉంటుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్, ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, హెచ్ఎంటీ, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సీసీఐ), ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందని కేటీఆర్ తెలిపారు. ఈ ఆరు సంస్థలకు గతంలో సూమారు 7,200 ఎకరాల భూమిని రాష్ట్ర సర్కారు కేటాయించినట్లు వెల్లడించారు. ప్రభుత్వ ధరల ప్రకారం కనీసం రూ. 5వేల కోట్లకు పైగా ఈ భూముల విలువ ఉంటుందని, బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం రూ. 40వేల కోట్లు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మొద్దని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్కు మంత్రి కేటీఆర్ ఆదివారం ఓ లేఖ రాశారు.
ఆ భూముల్లో కొత్త పరిశ్రమలు పెట్టండి..
కేంద్ర సర్కారు అమ్మేస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్రం కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు లేదా సంస్థలను ప్రారంభించాలని మంత్రి కేటీఆర్ లేఖలో కోరారు. లేకుంటే ఆ భూములను రాష్ట్ర ప్రభుత్వానికి బదలాయించాలన్నారు. తెలంగాణ సర్వతోముఖాభివృద్ధికి దోహదపడే విధంగా ఆయా భూములను సద్వినియోగం చేసుకుంటామని చెప్పారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరారు. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా కోసం చేపట్టే స్కైవేలాంటి ప్రజోపయోగ ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి.. రాష్ట్ర సర్కారు ఇచ్చిన భూములను అమ్మే హక్కు ఎక్కడుందని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
రాష్ట్రాల హక్కులను కాలరాస్తున్న కేంద్రం..
ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాలరాస్తున్నట్లు ఉందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. దేశ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను కల్పించకుండా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కహానీలు చెబుతున్న మోదీ సర్కారు.. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని అమ్ముకునే పనిలో మాత్రం బీజీగా ఉందని విమర్శించారు. దేశాభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం అడ్డికి పావుసేరు లెక్కన అమ్ముతుందని మండిపడ్డారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన ఎన్నో రాజ్యాంగబద్ద హామీల అమలును మోదీ సర్కారు పట్టించుకోలేదన్నారు. కానీ, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో పెట్టబడులు ఉపసంహరించే పేరుతో వాటి ఆస్తులను అమ్మేందుకు చేస్తున్న ప్రయత్నాలు చేస్తోందంటూ మండిపడ్డారు.
దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తమ పార్టీతోపాటు తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయా సంస్థలను అమ్మడానికి బదులు పునప్రారంభించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని మరోసారి కేంద్రాన్ని కోరుతున్నామన్నారు. ప్రస్తుతం తెలంగాణలో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో ఆయా సంస్థలను ప్రారంభించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేలాది మందికి ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను తిరిగి ప్రారంభిస్తే నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు విస్తృతమవుతాయన్న సోయి ప్రస్తుత మోడీ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరమని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు.
ఆ భూములపై తెలంగాణకు హక్కుంది..
ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం అమ్మాలనుకుంటున్న ప్రభుత్వ రంగ సంస్థల భౌతిక ఆస్తులను తెలంగాణ ప్రజల హక్కుగానే తమ ప్రభుత్వం గుర్తిస్తోందని మంత్రి కేటీఆర్ స్పష్టంచేశారు. ఆయా సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరణ పేరుతో ప్రైవేట్పరం చేయడమంటే తెలంగాణ ఆస్తులను అమ్ముతున్నట్టుగానే ఇక్కడి ప్రజలు భావిస్తారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి దక్కాల్సిన ఆయా పరిశ్రమల భౌతిక ఆస్తులను ప్రైవేట్పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తామన్నారు. తమిళనాడుతో పాటు చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తమ భూభాగంలో ఏర్పాటుచేసిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మే ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో పీఎస్యూల అమ్మకంపైన పునరాలోచన చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ కోరారు.