పంటభూములు కోల్పోతే సంక్షోభమే
మృత్తికల రక్షణకు అందరూ కలిసిరావాలి
సద్గురు జగ్గీ వాసుదేవ్ పిలుపు
దావోస్లో మంత్రి కేటీఆర్తో సమావేశం
హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): పంట భూములు సారాన్ని కోల్పోకుండా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని సద్గురు జగ్గీ వాసుదేవ్ అన్నారు. భూసారాన్ని కాపాడుకోలేకపోతే రానున్న రెండుమూడు దశాబ్దాల్లో వ్యవసాయ భూములు అంతరించిపోయి ఆహార సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. సేవ్ సాయిల్ పేరుతో చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా జగ్గీ వాసుదేవ్ మంగళవారం దావోస్ ప్రపంచ ఆర్థిక వేదిక సమావేశాల్లోని తెలంగాణ పెవిలియన్లో రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావుతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా సేవ్ సాయిల్ కార్యక్రమం గురించి వివరించారు. పంట భూములను కాపాడుకొనేందుకు లండన్ నుంచి కావేరి వరకు తాను నిర్వహిస్తున్న సేవ్ సాయిల్ ర్యాలీలో భాగం కావాలని వివిధ ప్రభుత్వాధినేతలు, ప్రముఖ కంపెనీలను కోరుతున్నట్టు తెలిపారు. ప్రభుత్వాలు వెంటనే పర్యావరణ అనుకూల కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయరంగంలో తీసుకొచ్చిన మార్పులపై జగ్గీ వాసుదేవ్ ప్రశంసలు కురిపించారు. రైతుల ఆదాయం పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా తాము ఉన్నామని తెలిపారు.
హరితహారంతో పర్యావరణ పరిరక్షణ: కేటీఆర్
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమం పర్యావరణ పరిరక్షణకు ఎంతగానో ఉపయోగపడుతున్నదని మంత్రి కేటీఆర్ తెలిపారు. పర్యావరణాన్ని కాపాడేందుకు చేసిన ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద మానవ ప్రయత్నం హరితహారం అని చెప్పారు. రైతు వేదికలు, వ్యవసాయ విస్తరణ అధికారుల నియామకం, రైతుబంధు, రైతుబీమా తదితర కార్యక్రమాల గురించి వివరించారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వం ఆ లక్ష్యాన్ని సాధించడంలో విఫలమైందని విమర్శించారు. సేవ్ సాయిల్ ర్యాలీ అద్భుతమైన కార్యక్రమమని కొనియాడారు. హైదరాబాద్కు రావాలని జగ్గీ వాసుదేవ్ను మంత్రి కేటీఆర్ ఆహ్వానించారు.