Minister KTR | ధరణి ద్వారా ఒక్కరోజులోనే భూముల రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అవుతుంటే రేవంత్కు వచ్చిన నొప్పేంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను.. రూట్ టు ఇన్కమ్గా మార్చుకొని భూ లావాదేవీలు చేసే దరిద్రులకు మాత్రమే ధరణితో ఇబ్బంది. బ్లాక్మెయిలర్లు, దళారులు, దొంగ భూ దందాలు చేసేవాళ్లకు.. లంగపనులు చేసేవాళ్లకు మాత్రమే ధరణితో ఇబ్బందులు ఉంటాయి. మిగతావాళ్లకు, రైతులకు, సాధారణ ప్రజలకు ఏ ఇబ్బందులూ లేవు.
-మంత్రి కేటీఆర్
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పుట్టుకను అవమానించి, అడుగడుగునా తెలంగాణ ప్రగతికి అడ్డం పడుతున్న ప్రధాని నరేంద్రమోదీ.. శనివారం వరంగల్లో నిర్వహించే శంకుస్థాపన సభను బహిష్కరిస్తున్నట్టు ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. కాజీపేటకు కోచ్ఫ్యాక్టరీ ఇస్తామని చెప్పి, ఇప్పుడు ఒక రిపేర్ షాప్ను, వ్యాగన్ తయారీ యూనిట్ను పెట్టడం అన్యాయమని మండిపడ్డారు. ఈ సమావేశానికి తాము వెళ్లబోవడం లేదని స్పష్టంచేశారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘2014లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచి తెలంగాణ పుట్టుకను అవమానించిన వ్యక్తి మోదీ. రాష్ట్రంపై నరనరాన విషం నింపుకున్న వ్యక్తి ఆయన. తల్లిని చంపి బిడ్డను బతికించారని వ్యాఖ్యానించి తెలంగాణ పుట్టుకనే అవమానించిన దుర్మార్గపు ప్రధానమంత్రి. సమాజంలో మతం పేరిట మంటలు పెట్టి చలికాచుకోవాలని చూసే వ్యక్తి. గుజరాత్లోని దబోద్లో ఏడాదిన్నర కిందట రూ.20 వేల కోట్లతో లోకోమోటివ్ కోచ్ ఫ్యాక్టరీ పెడతామని రైల్వే శాఖ ప్రకటిస్తే, మోదీ స్వయంగా వెళ్లి శంకుస్థాపన చేశారు. కాజీపేట కోచ్ఫ్యాక్టరీ హామీకి మాత్రం మంగళం పాడారు. మొత్తం రైలునే ఇక్కడ తయారు చేస్తామని నాడు చెప్పి.. ఇప్పుడేమో కేవలం రూ.521 కోట్లతో ఒక రిపేర్ షాప్ను, ఒక వ్యాగన్ షాప్ను పెట్టేందుకు వస్తున్నారు. అందుకే ఆయన పర్యటనకు ఎవరూ వెళ్లకూడదని నిర్ణయించుకున్నాం’ అని తెలిపారు.
విభజన చట్టంలోని ఒక్క హామీని కూడా అమలు చేయని ప్రధాని, ఈ రోజు ఏ ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నారని మంత్రి కేటీఆర్ నిలదీశారు. ‘నీ రాష్ట్రం గుజరాత్లోరూ.20 వేల కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ పెట్టి.. తెలంగాణకు 521 కోట్ల ముష్టి ఇచ్చి చేతులు దులుపుకొంటామంటే కుదరదు’ అని తేల్చిచెప్పారు. తెలంగాణకు కేంద్రం ఇవ్వకపోయినా మేధా అనే కంపెనీ వెయ్యి కోట్లతో కోచ్ ఫ్యాక్టరీ పెట్టిందని గుర్తు చేశారు. ఒక ప్రైవేట్ సంస్థ రూ.వెయ్యి కోట్లు వెచ్చిస్తే.. మోదీ ప్రభుత్వం మాత్రం రూ.521 కోట్లతో ఏదో పెడుతున్నామంటే నమ్మడానికి తెలంగాణ ప్రజలు పిచ్చోళ్లు కాదని స్పష్టం చేశారు. ‘మోదీ పర్యటిస్తున్న వరంగల్లోనే గిరిజన వర్సిటీ కోసం నేను, మంత్రి సత్యవతి కలిసి 360 ఎకరాల స్థలాన్ని సేకరించి కేంద్రానికి అప్పగించాం. తొమ్మిదేండ్ల కింద విభజన చట్టంలో కేంద్రం ఇచ్చిన ఈ హామీ నెరవేర్చకుండా మోదీ ఏ ముఖం పెట్టుకొని వస్తున్నారు? మహబూబాబాద్ జిల్లాలోని బయ్యారంలో ఉక్కు కర్మాగారం పెడతామని చెప్పి ప్రజలను మోసం చేసింది మీరు కా దా? కోచ్ ఫ్యాక్టరీ హామీని తుంగలో తొక్కి, తొమ్మిదేండ్ల పుణ్యకాలం అయిపోయాక ఇప్పుడు వచ్చి తూతూ మంత్రంగా ఫ్యాక్టరీ పెట్టి బయటపతామంటే ప్రజలు నమ్మరు’ అని స్పష్టంచేశారు.
ప్రధాని మోదీని ఎవరు కొట్టగలరు, ఎవరు వ్యతిరేకించి గట్టిగా నిలబడగలరు? అనే అంశంలో దేశ ప్రజలకు స్పష్టత ఉన్నదని మంత్రి కేటీఆర్ అన్నారు. ‘కేసులను, వేట కుక్కలను ఎవరు ఎదుర్కోగలరు? ఏ నాయకుడు తలవంచకుండా నిలబడగలడు? అనే అంశంలో తెలంగాణ ప్రజలకే కాదు.. దేశ ప్రజలకు కూడా స్పష్టత ఉన్నది. మోదీని ఢీకొట్టే సత్తా కేసీఆర్కే ఉన్నదని గ్రహించే అనేక రాష్ర్టాల నుంచి కీలక నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. మహారాష్ట్రలో బీఆర్ఎస్కు వస్తున్న స్పందనే ఇందుకు నిదర్శనం’ అని పేర్కొన్నారు. నాలుగేండ్ల కింద మోదీని పచ్చిబూతులు తిట్టిన చంద్రబాబు.. పాత ఎన్డీయే పక్షాల సమావేశానికి ఏ ముఖం పెట్టుకొని వెళ్లారని ప్రశ్నించారు. రాజకీయ అవసరాలు, మానసిక ఆందోళన, స్వప్రయోజనాలే పరమావధిగా జట్టుకడితే ఎవరూ నమ్మరని అన్నారు.
విదేశీ చేతుల్లో కాంగ్రెస్
ధరణి పోర్టల్ విదేశీయుల చేతుల్లో ఉన్నదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. స్వయంగా కాంగ్రెస్ పార్టీయే విదేశీయుల చేతుల్లో ఉన్నదని ఎద్దేవా చేశారు. రేవంత్ మాటలను తాము అంత సీరియస్గా తీసుకోబోమని చెప్పారు. పాత సచివాలయం నేలమాళిగల్లో రూ.10 వేల కోట్లు ఉన్నాయని ఒకసారి, కోకాపేటలో రూ.10 వేల కోట్ల కుంభకోణమని మరోసారి..ఇలా రేవంత్ నోటినుంచి రూ.వేల కోట్లు తప్ప వేరే ఏవీ రావని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ ఏనాడైనా బీజేపీని విమర్శించారా? అని ప్రశ్నించారు. పార్లమెంట్ సభ్యుడిగా ఒక్కరోజైనా మోదీని ప్రశ్నించారా? అని నిలదీశారు. ‘తెలంగాణకు ఏమీ చేయని మోదీని రేవంత్ ఎందుకు ప్రశ్నించరు? పొద్దున లేస్తే సీఎం కేసీఆర్పై..
బీఆర్ఎస్ ప్రభుత్వంపై నోరు పారేసుకోవడం తప్ప మోదీని, బీజేపీని పల్లెత్తు మాట అనకపోవటానికి కారణం ఏమిటి?’ అని సూటిగా ప్రశ్నించారు. ‘గాంధీభవన్లో గాడ్సే దూరాడు. రేవంత్ నూటికి నూరుపాళ్లు ఆర్ఎస్ఎస్, బీజేపీ మనిషి. మోదీని పల్లెత్తు మాట అనకుండా కంటికి రెప్పలా కాపాడుతున్న తీరు కాంగ్రెస్, బీజేపీ మధ్య స్నేహాన్ని సూచిస్తున్నది. మూడేండ్లలో మోదీపై.. కేంద్రప్రభుత్వంపై తాము చేసిన దాడిలో కాంగ్రెస్ పార్టీ పదోవంతైనా చేసిందా? రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కలిసి పనిచేశాయి. కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో కలిసే పనిచేశాయి. మునుగోడు, హుజూరాబాద్, దుబ్బాక, హుజూర్నగర్, నాగార్జునసాగర్.. ఇలా అన్నీ చోట్లా కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేశాయి’ అని విమర్శించారు. ప్రతిపక్షాలు సోషల్ మీడియాలో చేసే చిల్లర ప్రచారాలను ప్రజలు నమ్మరని స్పష్టం చేశారు.
రాహుల్ లీడర్ అని ఎవరన్నారు?
రాహుల్ గాంధీని దేశంలో ఎవరైనా లీడర్గా గుర్తిస్తున్నారా? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. రాష్ట్రం లో రూ.4 వేల పెన్షన్ ఇస్తామని ఖమ్మంలో రాహుల్గాంధీ ఏ హోదాలో ప్రకటించారని నిలదీశారు. ఆ యనేమైనా పార్టీ అధ్యక్షుడా? ఎంపీనా, పీసీసీ అధ్యక్షుడా? కాంగ్రెస్లో ఆయన స్థానం ఏమిటి అని ప్ర శ్నించారు. గతంలో రాహుల్గాంధీ రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అని ప్రకటిస్తే ఎవరూ నమ్మలేదని, అదే తాము రూ.లక్ష రుణమాఫీ అంటే ప్రజలు విశ్వసించారని గుర్తుచేశారు. ‘రాహుల్గాంధే కాదు ఆయ న ముత్తాత సంగతి కూడా తెలంగాణ ప్రజలకు తెలు సు. కాంగ్రెస్, బీజేపీ పుట్టుపూర్వోత్తరాలు తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణను కాంగ్రెస్, బీజేపీ ఎన్నిసార్లు దగా చేశాయో కూడా తెలుసు. ఎవరెన్ని చెప్పినా తమకు మంచి చేసేవాళ్లవైపే ప్రజలు ఉంటా రు. ఆ మంచి చేసేది సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీయేనని ప్రజలు స్పష్టంగా నమ్ముతున్నారు. కొత్త రూపంలో వచ్చిన రాబందులను ప్రజలు పట్టించుకోరు’ అని స్పష్టంచేశారు.
ఎవరెన్నికుట్రలు పన్ని నా.. ఎన్ని రకాల దుష్ప్రచారాలు చేసినా వందకు వంద శాతం పేదవారి గుండెల్లో కేసీఆర్ ఉన్నారని, వెయ్యికి వెయ్యి శాతం మళ్లీ కేసీఆరే సీఎం అవుతారని స్పష్టం చేశారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల జాబితాను త్వరలో ప్రకటిస్తారన్న ఊహాగానాలపై ‘తినబోతూ రుచులెందుకు’ అని కేటీఆర్ స్పందించారు. యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుపై సీఎం కేసీఆర్ త్వరలో ప్రకటన చేస్తారని తెలిపారు. ఈ విషయంలో మేధావులు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ సహా అన్ని స్థాయిల్లో సమాలోచనలు చేస్తున్నారని చెప్పా రు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీశ్రెడ్డి, సత్యవతి రాథోడ్, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, దేశపతి శ్రీనివాస్, శంభీపూర్ రాజు, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శంకర్నాయక్, పెద్ది సుదర్శన్రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్లు వాసుదేవరెడ్డి, సతీష్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి రమేశ్, పార్టీ నేతలు నాగజ్యోతి తదితరులు పాల్గొన్నారు.
తొమ్మిదేండ్లుగా తమ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తూనే ఉన్నారని, ధరణి పోర్టల్ లేదా మరేదైనా అంశంలో అవినీతి జరిగిందని అనిపిస్తే ఆధారాలతో సహా ఫిర్యాదు చేసుకోవచ్చని మంత్రి కేటీఆర్ సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ వేటకుక్కల్లా వ్యవహరిస్తున్న సీబీఐ, ఈడీ, ఐటీ.. ఇలా ఏ సంస్థకైనా ఫిర్యాదు చేసుకోవచ్చని తెలిపారు. ధరణి వల్ల ఇప్పటి దాకా ఏం జరిగిందో, ఎన్ని రిజిస్ట్రేషన్లు అయ్యాయో, ఎంతమందికి లబ్ధి జరిగిందో అన్నీ ప్రజలకు వివరిస్తామని చెప్పారు. ప్రజల దగ్గరికేపోయి పంచాయితీ పెడతామని పేర్కొన్నారు. ‘ధరణి ద్వారా ఒకేరోజు రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అయితే రేవంత్కు వచ్చిన నొప్పి ఏంటి? రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ను.. రూట్ టు ఇన్కంగా మార్చుకొని భూ లావాదేవీలు చేసే దరిద్రులకు మాత్రమే ధరణితో ఇబ్బంది’ అని దుయ్యబట్టారు. బ్లాక్మెయిలర్లు, దందాలు చేసేవాళ్లు, దొంగ భూ దందాలు చేసేవాళ్లకు.. లంగపనులు చేసేవాళ్లకు ధరణితో ఇబ్బందులు ఉంటాయని, మిగతావాళ్లకు ఏమీ ఉండవని అన్నారు.
హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): వైద్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పన విషయంలో తెలంగాణకు సమీపంలో కానీ, దగ్గరగా కానీ ఏదైనా రాష్ట్రం ఉన్నదా? అని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు ప్రశ్నించారు. తమ రాజకీయ ప్రత్యర్థులు ఎన్నికల ప్రణాళికలో బీజీగా ఉంటే, సీఎం కేసీఆర్ మాత్రం రాబోయే తరానికి అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంలో నిమగ్నమయ్యారని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం వైద్యం, వైద్య విద్యలో విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతున్నదని శుక్రవారం ట్వీట్ చేశారు. ఇకపై తెలంగాణలోని ప్రతి జిల్లాకు ఒకటి చొప్పున ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ నర్సింగ్ కాలేజీ, 500 పడకల సూపర్ స్పెషాలిటీ దవాఖాన ఏర్పాటు అవుతుందని వెల్లడించారు. స్వతంత్ర భారతదేశంలో ఇది ఒక అసమానమైన ఘనతగా పేర్కొన్నారు.