వరంగల్ : ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రి కేటీఆర్ పర్యటిస్తున్నారు. వరంగల్, హనుమకొండ, నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ నర్సంపేటకు చేరుకున్నారు. వ్యవసాయ మార్కెట్ యార్డ్ లోని హెలిప్యాడ్ వద్ద స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, అధికారులు మంత్రికి ఘన స్వాగతం పలికారు. కాగా, ఇక్కడి మున్సిపాలిటీ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
అలాగే నర్సంపేటలో రాష్ట్రంలోనే ప్రప్రథమంగా నిర్మించిన ఎన్పీజీ గ్యాస్ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం ఇక్కడ జరిగే సభలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆయన వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, మహబూబాబాద్ ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ గండ్ర జ్యోతి, జిల్లా కలెక్టర్ గోపి, అదనపు కలెక్టర్లు హరిసింగ్ శ్రీవత్స మున్సిపల్ చైర్ పర్సన్ రజిని తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.