హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల ఆత్మహత్యలకు తానే కారణమని ఆరోపించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ట్విట్టర్లో ‘బండి సంజయ్ కుమార్.. మీరు ఈ హాస్యాస్పదమైన, నిరాధార ఆరోపణలు ఆపకపోతే, నేను చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఆరోపించిన దాన్ని రుజువు చేయటానికి మీ దగ్గర సాక్ష్యం ఉంటే, దాన్ని ప్రజల ముందు ఉంచండి. లేకపోతే మీ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించి నందుకు బహిరంగక్షమాపణ చెప్పండి. ప్రచారం కోసం బండి సంజయ్ వాక్చాతుర్యాన్ని ప్రదర్శించొద్దు’ అని హెచ్చరించారు. ఈ వ్యవహారంలో నెటిజన్లు కేటీఆర్కు మద్దతుగా నిలిచారు.
‘గతంలో గుట్కా అక్రమ రవాణా కేసులో అరెస్టయిన ఆరుగురిలో బండిసంజయ్ ఒకడు.. గుట్కా రాజా బండిసంజయ్.. ఏం మాట్లాడుతాడో ఆయనకే అర్థం కాదు’ అని ట్వీట్ చేసిన ఓ నెటిజన్.. బండిసంజయ్ను అరెస్టు చేసిన ఫొటోను పోస్ట్ చేశారు. ‘కేటీఆర్ అన్నా.. లీగల్గా చర్యలు తీసుకోండి. కానీ బండిని అరెస్టు చేసి హీరోను చేయొద్దు. ప్రజల్లో తిరగనీయటమే తప్పు’అని మరొకరు వ్యాఖ్యానించారు. బండిది నరం లేని నాలుక.. ఎంతో మంది విద్యార్థులకు అండగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వం గురుకుల పాఠశాలలతో విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నది. ఇలాంటి పిచ్చి మాటలు చెప్తే ప్రజలు తరిమికొడుతారు సంజయ్..అని పలువురు ట్వీట్లు చేశారు. కేటీఆర్కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.