KTR | హైదరాబాద్ : ఎల్బీ నగర్ పరిధిలోని బైరామల్గూడ జంక్షన్ వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ పనుల్లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. రెండు పిల్లర్ల మధ్య ఇనుప ర్యాంపు ఏర్పాటు చేస్తుండగా అది కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో పలువురు కార్మికులు గాయపడ్డారు. వారందరిని కిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కిమ్స్లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. క్షతగాత్రుల వైద్య ఖర్చులు పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. ఈ ప్రమాదం జరగడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు జీహెచ్ఎంసీ ఇంజినీర్ ఇన్ చీఫ్ నేతృత్వంలో ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు. అంతేకాకుండా జేఎన్టీయూ యూనివర్సిటీ ఇంజినీర్లతో కూడా విచారణ జరిపిస్తామన్నారు. వర్కింగ్ ఏజెన్సీ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తేలితే, కఠిన చర్యలు తీసుకుంటామని కేటీఆర్ తెలిపారు.
ఎల్బీనగర్ వద్ద నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడిన వారిని మంత్రులు
కేటీఆర్, తలసాని శ్రీనివాస్. ఈ రోజు సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో పరామర్శించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. గాయపడిన వారికి ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. pic.twitter.com/7GjTbaQu7A— Namasthe Telangana (@ntdailyonline) June 21, 2023