కేంద్రమంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి
బుధవారం ఢిల్లీలో కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ను రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ ఐటీరంగ ప్రగతికి సహకారం అందించాలని, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పురోగమిస్తున్న హైదరాబాద్ పైనా దృష్టి సారించాలని విజ్ఞప్తిచేశారు. తెలంగాణ ఆవిర్భవించిన 2014 నుంచి ఇప్పటిదాకా జాతీయ ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించారు. ఆయన వెంట ఎంపీలు నామా నాగేశ్వర్రావు, కేఆర్ సురేశ్రెడ్డి ఉన్నారు.
హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఐటీ రంగ ప్రగతికి సహకారం అందించాలని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు కేంద్ర ఫ్రభుత్వాన్ని కోరారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగంలో పురోగమిస్తున్న హైదరాబాద్ పైనా దృష్టి సారించాలని విజ్ఞప్తిచేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి కేటీఆర్ బుధవారం కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఐటీ అభివృద్ధికి అందిస్తున్న ప్రోత్సాహకాలను ఆయనకు వివరించారు. రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్, ఐటీ రంగానికి తీసుకున్న చర్యల వల్ల దేశ, విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. తెలంగాణ ఆవిర్భవించిన 2014 నుంచి ఇప్పటిదాకా జాతీయ ఐటీ ఎగుమతుల్లో రాష్ట్రం సాధించిన ప్రగతిని వివరించారు.
రాష్ట్రం ఏర్పడిన స్వల్ప కాలంలోనే తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తున్నదని, ఫలితంగా దేశ జీడీపీ, తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ రెట్టింపు ప్రగతిని సాధించిందని నివేదికలు, గణాంకాలతో సహా వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల ఫలితంగా అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాపిల్ వంటి అంతర్జాతీయ సంస్థలు హైదరాబాద్లో తమ రెండో అతిపెద్ద కార్యక్షేత్రాలను నెలకొల్పాయని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలు, అందిస్తున్న రక్షణ, రాష్ట్రంలో ఉన్న నాణ్యమైన మానవనరులు తదితర అంశాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఐటీ రంగంలో కేవలం ఢిల్లీ, బెంగళూరు, పుణె వంటి నగరాలపైనే కాకుండా హైదరాబాద్పై కూడా దృష్టిసారించాలని మంత్రి కేటీఆర్ కోరారు. హైదరాబాద్ ప్రపంచస్థాయి నగరంగా అభివృద్ధి చెందుతున్నదని, ఈ నేపథ్యంలో అనేక జాతీ య, అంతర్జాతీయ సదస్సులకు ఇటీవలి కాలంలో అది వేదిక అయిందని చెప్పారు. ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల పురోగతిపై కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్లో సదస్సులు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాల ని కోరారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలు గా సహకరిస్తుందని హామీఇచ్చారు. మంత్రి వెంట టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్ తదితరులు ఉన్నారు.