ప్రభుత్వాలను కూల్చడం మాని.. పడిపోతున్న రూపాయిపై ముందు దృష్టి పెట్టండి
కార్పొరేట్ రుణమాఫీ చేయటమే మోదీ స్టైల్
ఖాళీ గిన్నెల మోతలా రాష్ట్ర బీజేపీ నేతల తీరు
ఒక్క మునుగోడు ఉప ఎన్నికతో ఏం మారుతది ?
తెలంగాణ సీఎంగా కేసీఆర్ హ్యాట్రిక్ ఖాయం
‘ఆస్క్ కేటీఆర్’లో ఐటీశాఖ మంత్రి స్పందన
వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతోనూ మాకు పొత్తు ఉండదు. తెలంగాణ ప్రజలతోనే మాకు పొత్తు.. ప్రస్తుత పరిస్థితుల్లో యువత కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. ఎలాంటి నేపథ్యం లేకుండా మన సీఎం కేసీఆర్ సహా ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి రావాలనుకొనే యువత ప్రస్తుత పరిస్థితులను నిరంతరం గమనిస్తూ, వాటిని ఆకళింపు చేసుకోవాలి. – మంత్రి కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): సోషల్ మీడియా డిస్ప్లే పిక్చర్ (డీపీ) మారిస్తే ఏమీ మారదని, జీడీపీ పెరిగితేనే దేశానికి మంచి జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు. పేదలకు అందించే ఉచిత పథకాలపై సరైన దృక్పథం, ప్రాధాన్యం ఉంటే మంచిదని, కానీ ప్రధాని మోదీ పేదలకు సాయం చేయటం మాని.. కార్పొరేట్ సంస్థలకు రూ.12 లక్షల కోట్ల రుణమాఫీ చేశారని మండిపడ్డారు. ఇదే మోదీ స్టైల్ అని ఎద్దేవా చేశారు. విపక్ష ప్రభుత్వాలను కూల్చటం మాని, పడిపోతున్న రూపాయిపై దృష్టి సారించాలని ప్రధాని మోదీకి హితవు పలికారు. శుక్రవారం ఆయన ట్విట్టర్ వేదికగా ఆస్క్ కేటీఆర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. రెండు గంటల పాటు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ప్రధాని హైదరాబాద్ వస్తే ప్రొటోకాల్ పాటించలేదని అడగ్గా.. అనధికారిక కార్యక్రమాల కోసం రాష్ట్రాల్లో పర్యటిస్తే ముఖ్యమంత్రి స్వాగతం చెప్పాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. జీఎస్టీ కౌన్సిల్లో బీజేపీకి ఉన్న మందబలంతో ప్రజలపై భారీగా పన్నులు పెంచుతున్నదని, ర్రాష్టాలు వ్యతిరేకించినా కేంద్రం పట్టించుకోవడం లేదని విమర్శించారు. దేశంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేటీకరించటంతో రైతులు, ఇతర వర్గాల ్రపయోజనాలు త్రీవంగా దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తం చేశారు.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ సీఎం అభ్యర్థి మీరేనా? అని ఓ నెటిజన్ అడగ్గా.. రాష్ట్ర ప్రజల ప్రేమ, ఆశీర్వాదాలతో తెలంగాణకు టీఆర్ఎస్ సేవ చేయటం కొనసాగిస్తుందని చెప్పారు. కేసీఆర్ రూపంలో సమర్థుడైన సీఎం మనకు ఉన్నారని, ప్రజల దీవెనలతో ఆయన హ్యాట్రిక్ కొడతారని వివరించారు. రాష్ట్ర బీజేపీ నాయకులు రెచ్చిపో యి మాట్లాడుతుంటే ఎందుకు సైలెంట్గా ఉన్నారని అడగ్గా.. ఖాళీ గిన్నెలకు మోత ఎక్కువ అని ఎద్దేవా చేశారు. బీజేపీ నేతలు గోబెల్స్ శిష్యులని, అబద్ధాలను ప్రచారం చేయడం, ద్వేషం పెంచటంలో సిద్ధహస్తులని అన్నారు. బండి సంజయ్ స్వయంగా ఇంగ్లిష్లో ట్వీట్ చేస్తున్నారా? అని ఓ నెటిజన్ ప్రశ్న వేయగా.. ఆ విషయం నువ్వే చెప్పాలని చమత్కరించారు. వచ్చే ఏడాది వివిధ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయన్న బండి సంజయ్ ప్రకటనపై.. ముంగేరి లాల్కి హసీన్ స్వప్నే అంటూ కేటీఆర్ జోక్ చేశారు. బీజేపీ జాతీయవాదం, మతవాదంతో ఎన్నికల్లో గెలిచేందుకు ప్రయత్నిస్తున్నదన్న ప్రశ్నకు.. మాది అభివృద్ధిపూర్వక జాతీయవాదమని, దానిపైనే తాము దృష్టిసారిస్తామని తేల్చి చెప్పారు.
ప్రజలతోనే మా పొత్తువచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ లేదా కాంగ్రెస్తో పొత్తు ఉంటుందా? అని ఓ నెటిజన్ ప్రశ్నించగా.. తమ పొత్తు తెలంగాణ ప్రజలతోనే ఉంటుందని కేటీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉపఎన్నికకు సంబంధించి మీ కామెంట్ అంటే.. ‘ముందు ఎన్నిక ప్రకటన జారీ అవనివ్వండి. నాకు తెలిసినంతవరకు మునుగోడు మరో ఉపఎన్నిక మాత్రమే. దానితో ఏం మారుతుంది?’ అని వ్యాఖ్యానించారు. వీఆర్ఏల జీతాలు, పదోన్నతుల అం శాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.
హైదరాబాద్లో ప్రత్యేకంగా ఏవియేషన్ యూనివర్సిటీ లేదా విద్యాసంస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఓ నెటిజన్ ఇచ్చిన సలహాపై స్పందించిన కేటీఆర్.. ఇప్పటికే క్రాన్ఫీల్డ్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఏవియేషన్ సంబంధిత సిలబస్ ప్రారంభించామని చెప్పారు. ఐటీ రంగంలో దేశంలోని అన్ని నగరాల కన్నా హైదరాబాద్ వేగంగా దూసుకుపోతున్నదని అన్నారు. ఐటీ పరిశ్రమను రాష్ట్రంలోని ఇతర నగరాలకు విస్తరించేందుకు అవసరమైన ప్రోత్సాహకాలను గ్రిడ్ పాలసీ ఇస్తుందని తెలిపారు. రాష్ట్రంలో స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటు దాదాపు 10 వేల ఎకరాల్లో 19 విభిన్న ప్రాంతాల్లో జరుగుతుందని వివరించారు. రాబోయే ఐదేండ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, భారత్ వంటనూనెల దిగుమతిపై ఆధారపడటాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని వెల్లడించారు.
తెలంగాణ వచ్చాక ఆర్థికంగా బలపడిందా? లేదా అప్పులు పెరిగాయా? అన్న ప్రశ్నకు.. 2014లో తెలంగాణ జీఎస్డీపీ రూ.5.06 లక్షల కోట్లు ఉంటే, 2022 మార్చి నాటికి రూ.11.55 లక్షల కోట్లకు పెరిగిందని కేటీఆర్ చెప్పారు. చేనేత కార్మికుల గురించి ఏదైనా ఒక్క మాట చెప్పండని అడగ్గా.. అద్భుతమైన కళా నైపుణ్యం ఉన్న చేనేత కార్మికులకు మన అందరి మద్దతు కావాలని అన్నారు. జర్నలిజం ముసుగులో వాక్స్వాతంత్ర్యం పేరుతో ప్రభుత్వ కార్యర్కమాలను హేళన చేస్తున్న వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదన్న ప్రశ్నకు.. వాక్ స్వేచ్ఛను సమర్థించే ప్రజాస్వామిక ప్రభుత్వం తమదని, కానీ ఈ మధ్య ఇతరులను అవహేళన చేసేందుకు, తిట్టేందుకే దాన్ని ఉపయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నేటి యువత రాజకీయాల్లో రావచ్చా? అని ఓ నెటిజన్ మంత్రి కేటీఆర్ను సలహా కోరగా.. ‘ప్రస్తుత పరిస్థితుల్లో యువత కచ్చితంగా రాజకీయాల్లోకి రావాలి. ఎలాంటి నేపథ్యం లేకుండా మన సీఎం కేసీఆర్తో సహా ఎంతోమంది రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లోకి రావాలనుకొనే యువత ప్రస్తుత పరిస్థితులను ఆకళింపు చేసుకోవాలి’ అని సూచించారు. నూతన సెక్రటేరియట్ దసరాకు సిద్ధమవుతుందని ఆశిస్తున్నట్టు మరో ప్రశ్నకు బదులిచ్చారు. విద్యుత్తు సంస్కరణలపై స్పందిస్తూ.. ఆ వ్యవస్థను ప్రైవేటీకరిస్తే రాయితీలు పొందే రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలిపారు.
ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం.. రెండు గంటల్లోనే ట్విట్టర్ టాప్ ట్రెండింగ్లో ఒకటిగా నిలిచింది. కేటీఆర్ను అడిగిన ప్రశ్నలు.. వాటికి ఆయన ఇచ్చిన సమాధానాలను నెటిజన్లు భారీగా రీట్వీట్ చేశారు. మొత్తంగా 22.8 వేల ట్వీట్లు ఆస్క్ కేటీఆర్ హ్యాష్ట్యాగ్తో పోస్ట్ అయ్యాయి. దీంతో ట్విట్టర్ ట్రెండింగ్లో ‘ఆస్క్ కేటీఆర్’ టాప్గా నిలిచింది.