జయశంకర్ భూపాలపల్లి, ఫిబ్రవరి 22 (నమస్తేతెలంగాణ): ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం భూపాలపల్లి నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా గణపురం మండలానికి హెలికాప్టర్లో చేరుకుంటారు. రూ.275.95 కోట్ల నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
జయశంకర్ భూపాలపల్లిలో నూతనంగా నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా కార్యాలయ భవనం
సింగరేణి కార్మికుల కోసం జిల్లాకేంద్రంలో సింగరేణి సంస్థ రూ.229 కోట్ల వ్యయంతో నిర్మించిన 994 డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయం (రామప్ప కాలనీ), జిల్లాకేంద్రంలోని వేశాలపల్లిలో పేదల కోసం రూ.33.08 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన 544 డబుల్ బెడ్రూం ఇండ్లు, రూ.3 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆర్అండ్బీ అతిథి గృహం, గణపురం మండల కేంద్రంలో రూ. కోటి వ్యయంతో నిర్మించిన తహసిల్దార్ కార్యాలయ నూతన భవనం, గణపురం మండలం గాంధీనగర్ వద్ద రూ.4 కోట్ల వ్యయంతో నిర్మించిన మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల భవనం, రూ.14.59 లక్షలతో నిర్మించిన వీధి వ్యాపారుల సముదాయం, దివ్యాంగుల సౌకర్యార్థం రూ.23 లక్షలతో నిర్మించిన దివ్యాంగుల నూతన భవనాలకు ప్రారంభోత్సవం చేయనున్నారు.
అలాగే రూ.1.50 కోట్లతో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలో రూ.4.50 కోట్లతో చేపట్టే సింగరేణి మినీ స్టేడియం పనులు, రూ.కోటి వ్యయంతో చేపట్టనున్న జిల్లా గ్రంథాలయ సంస్థ నూతన భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేస్తారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో సాయం త్రం నిర్వహించే బహిరంగ సభలో పాల్గొని సభికులనుద్దేశించి ప్రసంగించనున్నారు. మంత్రి కేటీఆర్ పర్యటన నేపథ్యంలో అటు అధికారులు, ఇటు పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి నేతృత్వంలో భారీ ఏర్పాట్లు చేశారు.
27న సోడాషపల్లికి మంత్రి కేటీఆర్
వేలేరు: హనుమకొండ జిల్లా వేలేరు మండలం సోడాషపల్లికి ఈ నెల 27న ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారు. స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గంలోని ఎగువ ప్రాంతాలకు నీరందించే పైపులైన్ పనులను శంకుస్థాపన చేయనున్నారు. సుమారు రూ.133 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. సోడాషపల్లి శివారులో రైతు కృతజ్ఞతా సభలో పాల్గొననున్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక నేతలతో కలిసి ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి, ఎమ్మెల్యే టీ రాజయ్య, జడ్పీ చైర్మన్లు సుధీర్కుమార్, పాగాల సంపత్రెడ్డి, వరంగల్ సీపీ రంగనాథ్ సభా స్థలాన్ని పరిశీలించారు.