నాలుగు రోజులపాటు లండన్లో పలు ప్రముఖ కంపెనీలతో సమావేశాలు నిర్వహించిన అనంతరం మంత్రి కేటీఆర్ ఆదివారం లండన్ నుంచి దావోస్కు బయలుదేరారు. లండన్ హీత్రో విమానాశ్రయం నుంచి మంత్రి కేటీఆర్ జ్యూరిక్ చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దావోస్కు చేరుకుంటారు. సోమవారం నుంచి జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సమావేశాల్లో మంత్రి కేటీఆర్ ప్రపంచంలోని పలు ప్రతిష్టాత్మక కంపెనీలతో సమావేశమవుతారు.
మూడు రోజుల పాటు జరిగే సమావేశాల్లో, ప్రధాన సమావేశ మందిరంలో జరిగే పలు చర్చల్లో పాల్గొంటారు. అనంతరం 26వ తేదీన స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ నగరంలో పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశమవుతారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు బయల్దేరిన మంత్రి బృందానికి లండన్లోని టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ కార్యకర్తలు, ఎన్ఆర్ఐలు వీడ్కోలు పలికారు.