వేములవాడ: కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మవద్దని, కాంగ్రెస్ను నమ్మి ఓటేస్తే మోసపోతమని మంత్రి కేటీఆర్ అన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి చల్మడ లక్ష్మీనర్సంహారావును గెలిపిస్తే నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని సిరిసిల్లలా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. కొత్తగా మన్నెగూడ మండలం ఏర్పాటు చేస్తామని, నియోజకవర్గంలో ఒక జూనియర్ కాలేజీని స్థాపిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ముఖ్యంగా కలికోట సూరమ్మ చెరువును పూర్తిచేస్తామని తెలిపారు.
కలికోట సూరమ్మతో 40 ఊర్లకు నీళ్లు
‘కలికోట సూరమ్మ చెరువును పూర్తిచేయాలని వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మడ లక్ష్మీనర్సింహరావు కోరారు. కరోనా రాకపోతే ఇప్పటికే కలికోట సూరమ్మ పూర్తయ్యేది. 40 ఊర్లకు నీళ్లు వచ్చేవి. ఈసారి లక్ష్మీనర్సింహరావును మీరు గెలిపించండి.. కలికోట సూరమ్మ చెరువు పూర్తిచేసి 40 ఊర్లకు నీళ్లు ఇస్తం. మేడిపల్లి, కథలాపురం, బీమారం మండలాలు, కొత్తగా కాబోయే మన్నెగూడ మండలానికి నీళ్లిచ్చే బాధ్యత నాది. నేను మాట ఇస్తున్నా. జూనియర్ కాలేజీ కావాలె అని లక్ష్మీనర్సింహరావు చెప్పారు. రోడ్లు కావాలె అన్నరు. ఈ చిన్నచిన్న పనులు గాదు. మీరు లక్ష్మినర్సింహారావును గెలిపిస్తే.. నేను ఈ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని సిరిసిల్లలా అభివృద్ధి చేస్తనని హామీ ఇస్తున్నా’ అని మంత్రి చెప్పారు.
కాంగ్రెస్ అనే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోకండి
‘కాంగ్రెసోళ్లు, బీజేపోళ్లు పైసలిచ్చి ఓట్లడుగుతరు. ఎల్లమ్మ, పోశమ్మల మీద ఒట్లు పెట్టిస్తరు. పొరపాటున గూడా వాళ్లను నమ్మొద్దు. తుల ఉమక్కకు టికెట్ ఇచ్చినట్టే ఇచ్చి మోసం చేసిన బీజేపీకి ఈ నియోజకవర్గంలో డిపాజిట్ కూడా రానియ్యొద్దని మనవి చేస్తున్నా. కాంగ్రెస్ హయాంల సర్కారు దవాఖానల పరిస్థితి అధ్వాన్నంగా ఉండె. నాటి పరిస్థితుల మీద ‘నేను రాను బిడ్డో.. సర్కారు దవాఖానకు’ అని పాటలు వచ్చినయ్. ఇప్పుడు జనం మేం సర్కారు దవాఖానకే పోతం అంటున్నరు. ఇట్ల అన్ని రంగాల్లో గణనీయమైన అభివృద్ధి చేసి చూపించిన బీఆర్ఎస్ పార్టీని గెలిపించండి. కాంగ్రెస్ అనే దరిద్రాన్ని నెత్తిన పెట్టుకోకండి. కాంగ్రెస్ను గెలిపిస్తే మళ్లా ఎనకేటి కష్టాలే వస్తయ్. కాబట్టి ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి లక్ష్మినర్సింహారావుగారిని భారీ మెజారిటీతో గెలిపించండి. నియోజవర్గాన్ని దత్తత తీసుకుని.. అభివృద్ధి సంగతి నేను చూసుకుంట’ అని మంత్రి హామీ ఇచ్చారు.