KTR | హార్డ్ కోర్ ముస్లిం హేటర్స్ .. రాజాసింగ్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ పోటీ చేస్తున్నచోట కాంగ్రెస్ పెట్టింది డమ్మీ అభ్యర్థులనే. టీపీసీసీ అధ్యక్షుడే స్వయంగా బీజేపీ ఏజెంట్. ఆయన ఒక్క సందర్భంలోనైనా మోదీని తిట్టారా?
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో మరోసారి అధికారంలోకి రాబోయేది బీఆర్ఎస్సేనని, కాంగ్రెస్ గాలి అంతా సోషల్ మీడియాలోనే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు స్పష్టం చేశారు. ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని, 82 స్థానాలు గెలుచుకుంటామని తేల్చిచెప్పారు. పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి ఓడిపోతారని, ఆ పార్టీ సీనియర్లు చాలా మంది పోటీలో ఎదురీదుతున్నారని వెల్లడించారు. బుధవారం ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే.. ‘ తాజాగా మూడు సర్వేలు వచ్చాయి. వీటిలోనూ బీఆర్ఎస్కే అధికారం ఖాయమని స్పష్టం చేశాయి. కొన్ని ప్రతిష్ఠాత్మక సంస్థలు చేసిన సర్వేలు అవి. మూడింటికి మూడింటిలో 70-82 మధ్యలో సీట్లు బీఆర్ఎస్కు రాబోతున్నాయని తేలింది.
క్షేత్రస్థాయిలో కాంగ్రెస్కు అంత లేదు
కాంగ్రెస్ ఊపు అంతా సోషల్ మీడియాలోనే. క్షేత్రస్థాయి పరిశీలనలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి పోటీచేస్తున్న కొడంగల్లో బీఆర్ఎస్ గెలువబోతున్నది. అక్కడ రేవంత్రెడ్డి రెండోస్థానానికి పరిమితమవుతారు. కామారెడ్డిలో మూడోస్థానమే. ఇది పక్కా. ఆయనే గెలువడు. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందా? రాష్ట్రంలోని కాంగ్రెస్ అగ్రనేతలు, ముఖ్యనేతలందరు ఎన్నికల్లో ఎదురీదుతున్నారు. నల్లగొండలో వెంకట్రెడ్డి, నాగార్జునసాగర్లో జానారెడ్డి కుమారుడు జయవీర్రెడ్డి, మధిరలో భట్టివిక్రమార్క.. ఇలా అనేకమంది ఓడిపోబోతున్నారు. డిసెంబర్ 3న మీరే చూస్తారు. ఖమ్మంలో మేం కనీసం 6 సీట్లు గెలుస్తాం. మరో రెండుస్థానాల్లో పోటీ ఇస్తున్నాం. ఇల్లందు, అశ్వారావుపేట, కొత్తగూడెం, భద్రాచాలానికి ఇటీవల వెళ్లొచ్చా. ప్రజల నుంచి అద్భుతమైన స్పందన కనిపించింది. కరీంనగర్, వరంగల్లలో మేం సులువు అని ఊహించిన స్థానాల్లో కొంత పోటీ ఉన్నది. ఈసారి ఎవరూ ఊహించని ఫలితాలు వస్తాయి. బీజేపీ మళ్లీ సింగిల్ డిజిట్కే పరిమితమవుతుంది. కాంగ్రెస్కు గతంలో వచ్చిన సీట్లకు కొద్దిగా అటుఇటుగానే వస్తాయి తప్ప పెద్దగా ఏమీ ఉండదు.
15-18 చోట్ల బీజేపీతో మాకు పోటీ
రాష్ట్రంలో 15-18 చోట్ల బీఆర్ఎస్తో బీజేపీ నేరుగా తలపడుతున్నది. ఉదాహారణకు కోరుట్ల, కరీంనగర్, గోషామహాల్, హుజురాబాద్.. ఇలాంటి స్థానాల్లో బీజేపీతోనే మాకు పోటీ. ఈ స్థానాల్లో గెలిచేది బీఆర్ఎస్సే. రెండుచోట్ల పోటీచేస్తున్న బీజేపీ నేత ఈటల రాజేందర్ రెండు చోట్లా ఓడిపోతారు. కరీంనగర్లో బండి సంజయ్ కూడా ఓడిపోతారు. మునుగోడులో రాజగోపాల్రెడ్డి తీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. 18 స్థానాల్లో బీజేపీ రెండో స్థానంలో ఉన్నదనుకుంటే, 7 స్థానాల్లో ఎంఐఎం పార్టీలకు మినహాయిస్తే, కాంగ్రెస్ నికరంగా మాతో పోటీపడుతున్నది 94 స్థానాల్లోనే. అందులో ఆ పార్టీకి ఆశలు లేని స్థానాలు 40 వరకు ఉన్నాయి. అంటే మాతో పోటీపడేవి 54 స్థానాలే. నల్లగొండలో ఈసారి మేం 7-9 సీట్లు గెలవబోతున్నాం. ఓవరాల్గా బీఆర్ఎస్ పరిస్థితి యధాతథంగా ఉన్నది.
నిరుద్యోగులకు భరోసా
మా ఎన్నికల ప్రచార సరళిని రోజువారీగా సమీక్షించుకుంటున్నాం. నిరుద్యోగుల విషయంలో మేం చేసింది చెప్పి, చేయబోయేదానిపై వారికి స్పష్టత ఇస్తున్నాం. యువతలో విశ్వాసం నింపేందుకు టీఎస్పీఎస్సీలో మరిన్ని సంస్కరణలు, ప్రక్షాళన చేయడం, లోటుపాట్లు లేకుండా రిక్రూట్మెంట్ జాబ్ క్యాలెండర్ విడుదల వంటివి చేపట్టాలని నిర్ణయించాం. రాబోయే వారం పాటు మా ప్రచారంలో ఇదే విషయాన్ని బలంగా తీసుకెళ్తాం. ఇక, ఈసీ అనుమతి రాగానే మిగిలిన రుణమాఫీ కూడా పూర్తి చేస్తాం. అనుమతి రాకపోతే బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక డిసెంబర్ 5న తర్వాత మేమే ఇస్తాం.
ప్రజల్లోకి విస్తృతంగా కేసీఆర్ భరోసా
పోలింగ్కు ఇంకో వారం మాత్రమే ఉన్నది. ఈ నేపథ్యంలో కేసీఆర్ భరోసా మ్యానిఫెస్టోపై ప్రజల్లో విస్తృత చర్చ పెడుతున్నాం. ప్రభుత్వం రాగానే చెప్పినవన్నీ చేసి తీరుతాం. పెన్షన్ మొత్తాల పెంపును దశలవారీగా చేస్తాం. బీడీ కార్మికులకు కటాఫ్ తేదీలను పెంచుతాం. గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు కూడా కేసీఆర్ బీమా వర్తిస్తుందని ఇటీవల నిజామాబాద్ జిల్లా బహిరంగ సభలో తెలిపారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ పథకం ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుంది. ఆటో డ్రైవర్లకు పర్మిట్, ఫిట్నెస్ చార్జీలను మాఫీ చేస్తామని సీఎం ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇచ్చే క్రమంలో ముదిరాజ్లకు సీట్లు సర్దుబాటు చేయలేకపోయాం. ఇదే విషయాన్ని మేం నిజాయతీగా చెప్పాం. మా పార్టీ కార్యక్రమాలను చూసి ముదిరాజ్ వర్గానికి చెందిన అగ్రనాయకులు కాసాని జ్ఙానేశ్వర్, ఎర్రశేఖర్, పీ చంద్రశేఖర్, నగేశ్ ముదిరాజ్ వంటివారు బీఆర్ఎస్లో చేరారు. మా పార్టీలో చాలా మంది ముదిరాజ్ నేతలున్నారు. వీరివల్ల ముదిరాజ్ వర్గంలో బీఆర్ఎస్ పార్టీ తమను కాపాడుకుంటుందన్న విశ్వాసం పెరిగింది.
ఏనాడూ బీజేపీతో కలిసి పనిచేయలేదు
ఏ నాయకుడు విమర్శించని స్థాయిలో ప్రధాని మోదీని విమర్శించింది కేసీఆర్ ఒక్కరే. మేం ఏనాడూ బీజేపీతో పొత్తు పెట్టుకోలేదు. 2004లో కాంగ్రెస్తో, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలతోనే పొత్తు పెట్టుకున్నాం. అయినా, బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అనటం విడ్డూరం. నిజంగా బీజేపీకి బీఆర్ఎస్ బీ టీం అయితే మా మంత్రులు, నేతలపై ఐటీ, సీబీఐ, ఈడీ దాడులు ఎందుకు జరుగుతున్నాయి. 2019 లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలో ఆ రెండు పార్టీలు కలిసి పనిచేశాయని చిన్న పిల్లవాడికీ తెలుసు. కాంగ్రెస్ ఓటును బీజేపీకి వేయించారు. ఈ ఎన్నికల్లో కూడా ముగ్గురు డమ్మీ అభ్యర్థులను కాంగ్రెస్ పెట్టింది.
నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు
వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టకపోతే నిధులు ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పిన కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్కు ధన్యవాదాలు. మేం ఇదే విషయాన్ని చెప్తే బండి సంజయ్, కిషన్రెడ్డి, ఈటల రాజేందర్ వంటి బీజేపీ నేతలు బుకాయించారు. కానీ, నిర్మలా సీతారామన్ వాస్తవాలు చెప్పారు. ఇక, తెలంగాణను అప్పుల పాలు చేశామని ఆమె వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం. మేం ఏ అప్పు చేసినా కేంద్ర ఆర్థికశాఖ నిర్దేశించిన ఎఫ్ఆర్బీఎం పరిమితికి లోబడే చేశాం. కేంద్ర ఆర్థిక శాఖ అనుమతి లేకుండా రాష్ట్రాలు అప్పులు చేయలేవు.
తెలంగాణ గొంతు కేసీఆర్ను పిసికేసే కుట్ర
తెలంగాణకు ఉన్న ఒకే ఒక గొంతు కేసీఆర్. ఆయనను తెలంగాణదాటి రాకుండా చూసుకోవాలన్నదే రాహుల్గాంధీ, మోదీ కుట్ర. కాంగ్రెస్ కర్ణాటక నుంచి డబ్బుల కట్టలు తెస్తున్నది. బీజేపీ గుజరాత్ నుంచి తెస్తున్నది. ఎంత వస్తున్నదన్నది మీరందరూ చూస్తున్నదే. తెలంగాణకు మనదంటూ ఒక అస్తిత్వం ఉండాలంటే కేసీఆర్ ఉండాలి. రాహుల్కైనా, మోదీకైనా దేశంలోని 28 రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. కానీ, కేసీఆర్కు తెలంగాణే ఎపిక్ సెంటర్. వాళ్లేమో తెలంగాణను గెలవాలనుకుంటున్నారు. మేం తెలంగాణను గెలిపించుకోవాలనుకుంటున్నాం.
సోషల్ మీడియాలో జరుగుతున్న కృత్రిమ ప్రచారం, వర్డ్ ఆఫ్ మౌత్గా మాత్రమే కాంగ్రెస్ కనిపిస్తున్నది. గతంలో బీజేపీ ఒక్కసారిగా పడిపోవడంతో అక్కడి నుంచి కొంత కాంగ్రెస్కు వచ్చి ఉంటుంది. కాంగ్రెస్ కూడా పాలపొంగు వంటిదే. బీఆర్ఎస్కు సొంత క్యాడర్ ఉన్నది. కృత్రిమ హైప్ మాకు అవసరం లేదు.
మేం తెలంగాణను గెలిపించుకోవాలని అనుకుంటున్నాం. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణను గెలవాలనుకుంటున్నాయి.
-మంత్రి కేటీఆర్