రాబోయే పదేండ్లలో హైదరాబాద్కు, వరంగల్కు పెద్ద తేడా ఉండదు. ఐటీ రంగంలో భవిష్యత్తు టైర్-2 నగరాలదే. రానున్న రోజుల్లో వరంగల్కు హైస్పీడ్ రైలు వస్తుంది. ఎన్నారైలు ఏపీ, బెంగళూరులోనూ ఐటీ సంస్థలు పెట్టాలి. కావాలంటే జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తా.
– మంత్రి కేటీఆర్
వరంగల్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): దేశంలో ఎక్కడాలేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ వైపు ఉండా లో.. స్కాంలు, అబద్ధాలు, మోసాలతో కాలం గడిపే బీజేపీ, కాంగ్రెస్ వైపు ఉండాలో ప్రజలు తేల్చుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోరారు. వచ్చే ఎన్నికలు చాలా కీలకమైనవని, ప్రజలు బాగా ఆలోచించి నిర్ణ యం తీసుకోవాలని అన్నారు. కేసీఆర్ది సంక్షేమమని, ప్రతిపక్షాలది సంక్షోభమని స్పష్టం చేశారు. ఎన్నో పథకాలను అమలు చేస్తున్న కారు పార్టీ ఇటువైపు ఉంటే.. 60 ఏండ్లు తెలంగాణను పీక్కుతిన్న కాంగ్రెస్.. మోసాలు చేసే బీజేపీ బేకార్గాళ్లు అటువైపు ఉన్నారని ధ్వజమెత్తారు. శుక్రవారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్తో కలిసి మంత్రి కేటీఆర్ గ్రేటర్ వరంగల్లోని దాదాపు వెయ్యి కోట్ల అభివృద్ధి పనులను ప్రారంభించి, పలు శంకుస్థాపనలు చేశారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ స్థాయి బీఆర్ఎస్ బహిరంగసభలో, వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. సాధ్యం కాని హామీలు ఇస్తూ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ను గమనిస్తూ ఉండాలని సూచించారు. తెలంగాణపై సందు దొరికితే మోదీ విషం చిమ్ముతున్నారు. రాష్ర్టానికి గుండు సున్నా ఇచ్చిన మోదీ దేవుడని బండి సంజయ్ అంటున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు తెలంగాణలో అభివృద్ధి, సంక్షే మం చేసింది కేసీఆరేనని, ఇకముందు చేయబోయేది కూడా కేసీఆరేనని, మళ్లీ సీఎం కాబోయేది కేసీఆరేనని చెప్పారు.
‘ఎన్నికలు రాగానే ఆగం కావద్దు. రంగస్థలం సినిమాలో నాగన్నా ఏ గట్టున ఉంటావో తేల్చుకోవాలి అన్నట్టు మన హనుమకొండ నాగన్నలు కూడా తేల్చుకోవాలి. రైతుబంధు, అనేక సంక్షేమ పథకాలు అందిస్తున్న వినయ్భాస్కర్ ఈ గట్టున ఉన్నరు’ అని మంత్రి కేటీఆర్ తెలిపారు. తాగునీరు, సాగునీరు, కరెంట్, సంక్షేమ పథకాలు ఇప్పుడున్నట్టు చేసుడు కాంగ్రెస్తోటి అయితదా? పేదల గురించి బీజేపీ ఆలోచిస్తదా? అని ప్రశ్నించారు. ‘కరెంట్ గురించి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్, బీజేపీ నాయకులకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా. బస్సులు పెట్టిస్త.. ఏ ఊరికి పోతరోపోయి వరుసగా నిలబడి కరెంట్ వైర్ పట్టుకోండి. కరెంట్ ఎక్కడ లేదో అప్పుడు తెలుస్తది. కరెంట్ తీగ చూడటానికి కేసీఆర్లా సన్నగా ఉంటది. ముట్టుకుంటే తెలుస్తది. జాడిచ్చి కొడుతది’ అని వెల్లడించారు. వరంగల్లో 24 అంతస్థుల బిల్డింగ్లో అతిపెద్ద సర్కా రు దవాఖాన కడుతున్నామని, దసరాకు ప్రా రంభించేలా పనులు చేస్తున్నామని తెలిపారు. ఆసరా పింఛను మరింత పెంచేలా సీఎం కేసీఆర్ ఆలోచిస్తున్నారని, త్వరలోనే దీనిపై ఆయన ప్రకటన చేస్తారని స్పష్టం చేశారు. వరంగల్తూర్పు నియోజకవర్గంలో ఒకే రోజు 15,072 మందికి సంక్షేమ పథకాలు అందించటం సంతోషంగా ఉన్నదని కేటీఆర్ అన్నారు.
వరంగల్ సిటీల భార్యాభర్త ఉన్నరు. ఆయన ఆటోడ్రైవర్, ఆమె ఇండ్లలో పని చేసుకుంటున్నది. ఒకరోజు ఇద్దరు కూర్చుని ఉన్నపడు పైనుంచి ఎర్రతేలు పడ్డది. అయ్యో తేలు కుట్టి సంపుతదని భార్య అన్నది. భర్త మాత్రం బయటికి ఉరికిండు. తేలును చంపుమంటే బైటికిపోతున్నవేంది అని ఆమె అడిగింది. బయట మొగోళ్లు ఉన్నరో చూసొస్తా అని అన్నడు. అచ్చం ఇలాగే కాంగ్రెస్, బీజేపీ వాళ్లు ఏం చేయాలన్న ఢిల్లీల అడిగి చెప్పాలె. వాళ్లకు బీఫారాలు ఢిల్లీలనే ఇయ్యాలె. బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ప్రజల అసలైన అవ్వల్దర్జా టీం.
– మంత్రి కేటీఆర్
‘వరంగల్, హనుమకొండ రెండు నియోజకవర్గాలు ఉద్యమానికి కేంద్రాలుగా నిలిచాయి. కేసీఆర్కు ఉత్సాహాన్ని, ఉద్యమానికి ఊపిరిలూదిన ప్రాంతం ఇది. సర్వదా, శతదా మీకు రుణపడి ఉంటాం. ఈ రోజు వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రూ.900 కోట్లతో వివిధ కార్యక్రమాలు ప్రారంభించుకున్నాం’ అని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్కు దీటుగా వరంగల్ వంటి నగరాల్లో ఐటీ కంపెనీలు విస్తరించేలా వసతులు కల్పిస్తున్నామని అన్నారు.
మంత్రి కేటీఆర్ కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులకు భరోసా కల్పించారు. మడికొండ ఐటీ పార్ వద్ద కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు కలిశారు. పీహెచ్డీ అడ్మిషన్లలో జరిగిన పరిణామాలు వివరించారు. దానిపై మంత్రి విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని వరంగల్ సీపీకి ఆదేశించారు. వర్సిటీలోని సమస్యలపై ఉన్నత విద్యా మండలి చైర్మన్ లింబాద్రితో మాట్లాడి పరిషరిస్తానని హామీ ఇచ్చారు. సిక్కులు, ఆశావర్కర్లు సమస్యలు వివరించగా, త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. బీజేపీ నాయకుడు ఈగ మల్లేశం బీఆర్ఎస్లో చేరగా, మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి కండువాను కప్పి బీఆర్ఎస్లోకి స్వాగతించారు. కార్యక్రమాల్లో మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాశ్, ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, పసునూరి దయాకర్, మాలోత్ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, పల్లా రాజేశ్వర్రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు చల్లా ధర్మారెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నన్నపునేని నరేందర్, అరూరి రమేశ్, బానోత్ శంకర్నాయక్ తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమ ప్రతిదశలో కేసీఆర్ వెంట నడిచిన వినయ్భాస్కర్ మాస్ లీడర్ అని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో వినయన్నను రికార్డు మెజారిటీతో గెలిపించాలని కోరారు. అన్న అంటే నేనున్నానంటూ ఉరికి వచ్చే నాయకుడు వినయన్న అని ప్రశంసించారు. ఏ సందర్భంలో ఎప్పుడు పిలిచినా వినయన్న వెంటనే వస్తారని తెలిపారు. నరేందర్ను ఆశీర్వదించారని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.