KTR | హైదరాబాద్ : రాజకీయ నిరుద్యోగులు యువతను రెచ్చగొడుతున్నారు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పొలిటికల్ టూరిస్టులకు తెలంగాణ స్వాగతం పలుకుతుంది అని పేర్కొన్నారు. ప్రియాంక గాంధీ తన పొలిటికల్ టూర్ను ఎడ్యుకేషన్ టూర్గా మార్చుకుని తెలంగాణ ప్రజలకు అందుతున్న వాటి ఫలాలను తెలుసుకోవాలని సూచించారు.
కాంగ్రెస్, బీజేపీలకు ఒక పాలసీ అంటూ ఉంటే దేశంలో నిరుద్యోగ సమస్య ఉండేదే కాదన్నారు. నిరుద్యోగాన్ని పెంచి పోషించినందుకు కాంగ్రెస్, బీజేపీ యువతకు క్షమాపణ చెప్పాలి అని కేటీఆర్ డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమకారుల బలిదానాలకు కారణమైనందుకు ప్రియాంక గాంధీ కాంగ్రెస్ తరపున క్షమాపణ చెప్పాలి. సోనియా గాంధీ బలిదేవత అన్న వ్యక్తికే పీసీసీ చీఫ్ పదవి ఇచ్చారు. గాంధీ భవన్ను గాడ్సేకు అప్పగించి తన అంతానికి కాంగ్రెస్ వీలునామా రాసుకుంది. కాంగ్రెస్ అమాయకత్వమో, ఆత్మహత్యా సదృశ్యమో తేల్చుకోవాలి అని కేటీఆర్ అన్నారు.
పదేండ్లుగా అధికారంలో లేకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఫ్రస్టేషన్లో ఉందని కేటీఆర్ తెలిపారు. 9 ఏండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశంలో నంబర్ వన్గా ఉందన్నారు. తప్పుడు కేసులు వేసి ప్రాజెక్టులు ఆపిన సొంత పార్టీ నేతలకు ప్రియాంక గాంధీ బుద్ధి చెప్పాలి. ప్రభుత్వ రంగంలో 2.2 లక్షల ఉద్యోగాలు, ప్రయివేటు రంగంలో 22 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని కేటీఆర్ తెలిపారు.