KTR | రాజన్న సిరిసిల్ల : సీఎం కేసీఆర్ ఆశీస్సులతో, నాటి వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రోద్బలంతో, ప్రస్తుతం వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వ్యవసాయ కాలేజీని ఏర్పాటు చేసుకుని ఇవాళ ప్రారంభించుకున్నాం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఆధునిక వ్యవసాయ కళాశాలలోని వసతులను సద్వినియోగం చేసుకుంటే దేశానికే గర్వకారణంగా నిలిచే శాస్త్రవేత్తలు, అగ్రానమిస్ట్లు తయారవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని, వసతులను సద్వినియోగం చేసుకుంటే.. మన వ్యవసాయ రంగం దేశానికి దిక్సూచిగా మారుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
తంగళ్లపల్లి మండలం జిల్లెల శివారులో నూతనంగా ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ కాలేజీని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి మంత్రులు నిరంజన్ రెడ్డి, కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు.
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో గతంలో ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ విస్తరణ జరిగిందని తెలిపారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో వచ్చేటప్పుడు వరుసగా కొండ పోచమ్మ సాగర్, మల్లన్న సాగర్, రంగనాయక సాగర్, అన్నపూర్ణ రిజర్వాయర్, మిడ్ మానేరు జలశయాలు చూస్తూ వచ్చాము. ఆ రిజర్వాయర్లన్నీ నీటితో కళకళలాడుతున్నాయి. కళ్లు ఉండి చూడలేని వారు.. కాళేశ్వరం వల్ల ఒక్క ఎకరానికి నీరు వచ్చిందా? అని నటిస్తూ మాట్లాడుతున్నారు. తెలంగాణ రాక ముందు ఒక్క రిజర్వాయర్ లేదు. ఈ రిజర్వాయర్ల కింద లక్షలాది ఎకరాలకు సాగునీరు అందుతుందని కేటీఆర్ తెలిపారు.
కేసీఆర్కు రైతులు కొత్త నిర్వచనం చెబుతున్నారని మంత్రి తెలిపారు. కే అంటే కాల్వలు, సీ అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు అని రైతులు అనుకుంటున్నారు. రైతు బంధు ఇస్తున్న కేసీఆర్ను రైతులు తమ గుండెల్లో నిక్షిప్తం చేసుకున్నారు. దండగ అన్న వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ నేడు పండుగగా చేశారు అని కేటీఆర్ పేర్కొన్నారు. విద్యార్థులు ఉద్యోగాలు సృష్టించే పారిశ్రామిక వేత్తలుగా, ఎంటర్ ప్రెన్యూర్స్గా ఎదగాలన్నారు. ఆచార్య జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసుకున్న అగ్రి హబ్ శాటిలైట్ క్యాంపస్ ఇక్కడ కూడా ఏర్పాటు చేయాలి. వ్యవసాయ కళాశాలను పీజీ కళాశాలగా అప్గ్రేడ్ చేయాలని కేటీఆర్ కోరారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా, జిల్లెల్లలో వ్యవసాయ కళాశాలను ప్రారంభించిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన మంత్రి @KTRBRS. pic.twitter.com/wPaTICgULg
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) April 12, 2023