Minister KTR | రాజన్న సిరిసిల్ల : ప్రధాని నరేంద్ర మోదీ సహకరించకున్నా.. జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ తొమ్మిదేండ్లలో కేసీఆర్ 21 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని, వచ్చే సంవత్సరం మరో ఎనిమిది కాలేజీలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
1993లో నేను కూడా బైపీసీ స్టూడెంట్ని అని కేటీఆర్ తెలిపారు. మా అమ్మ నన్ను డాక్టర్ చేయాలనుకున్నారు. నాన్నేమో నన్ను ఐఏఎస్ ఆఫీసర్ను చేయాలనుకున్నారు. నాకు అప్పుడు ఎంసెట్లో 1600 ర్యాంక్ వచ్చింది.. కానీ డాక్టర్ సీట్ రాలేదు. రాజకీయ నాయకుడిని అయ్యాను. 2009లో నేను సిరిసిల్ల ఎమ్మెల్యేగా ఎన్నికైనప్పుడు డిగ్రీ కాలేజీ ఏర్పాటు కోసం గొడవ జరిగింది. డిగ్రీ కాలేజీ సిరిసిల్ల, వేములవాడలో పెట్టాలని గొడవ జరిగి, అటు ఇటు కాకుండా మధ్యలో పెట్టారు. అలాంటిది నేడు సిరిసిల్లకు మెడికల్ కాలేజీ, ఇంజినీరింగ్ కాలేజీ, నర్సింగ్, అగ్రికల్చర్ లాంటి పెద్ద పెద్ద కాలేజీలు వచ్చాయన్నారు. రాష్ట్రంలోనే ప్రప్రథమ కేజీ టూ పీజీ విద్య మన జిల్లాలోనే ఏర్పాటు చేసుకున్నామని కేటీఆర్ తెలిపారు.
వరి ధాన్యం ఉత్పత్తిలోనే కాకుండా.. డాక్టర్ల ఉత్పత్తిలో కూడా తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నేను రాను బిడ్డో సర్కార్ దవాఖానకు అనే పరిస్ధితులు ఉండేవి. మొన్నటి దాకా ఇక్కడ డాక్టర్ల కొరత వుండేది. కానీ ఇప్పుడు మెడికల్ కాలేజ్ వలన కేవలం మన జిల్లాలో దాదాపు 100కు పైగా డాక్టర్లు సేవలందిస్తారు. తెలంగాణా రాష్ట్రంలో ప్రతీ లక్ష జనాభాకు 22 మంది డాక్టర్లు ఉన్నారని తెలిపారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి.. కాంగ్రెస్, బీజేపీ వాళ్లు మెడికల్ కాలేజ్ పెట్టాలంటే ఎవరిని అడగాలి..?
వాళ్లకు టికెట్లు కావాలంటే ఎవరిని అడగాలి..? ఢిల్లీ వాళ్లని అడగాలి. మనకు అలాంటి పరిస్థితి లేదన్నారు కేటీఆర్. సిరిసిల్లలో నన్ను… వేములవాడలో చల్మెడ లక్ష్మీ నరసింహ రావును మంచి మెజారిటీతో గెలిపించండి అని కోరారు. మనస్ఫూర్తిగా చెప్తున్నా నాకు జన్మనిచ్చింది మా తల్లి అయితే నాకు రాజకీయ జన్మనిచ్చింది సిరిసిల్ల అని చెప్పారు. మల్కపేట రిజర్వాయర్ పూర్తి చేసినందుకు మా రాజన్న సిరిసిల్ల జిల్లా రైతుల పక్షాన సీఎం కేసీఆర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ కేటీఆర్ తన ప్రసంగాన్ని ముగించారు.