KTR | నిజామాబాద్ : భూమాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు.. ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతమవుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ టవర్, న్యాక్ భవనం ప్రారంభించిన అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు.
గత పాలకులు ఈ జిల్లా పేదలను పట్టించుకోలేదని కేటీఆర్ పేర్కొన్నారు. ఇక ఎన్నికలు రాగానే మోపైతారు. సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్లు మీ వద్దకు కూడా వస్తారు. మీరు కూడా ఒక్కసారి దయచేసి ఆలోచించాలి. ఇవాళ హెలికాప్టర్లో వస్తుంటే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ దాకా చెరువులు నిండుకుండలా కనిపించాయి. ఎటు చూసినా ఒక్క ఇంచు ఖాళీ లేకుండా వరి నాట్లు వేయడంతో ఆకుపచ్చగా కనపడుతుంది. భూమాత ఆకుపచ్చ చీర కట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో.. ఆ మాదిరిగా ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతమవుతోందని కేటీఆర్ అన్నారు.
గతంలో నెర్రెలు బారిన నేల.. నెత్తురు కారిన నేల మన తెలంగాణ అని కేటీఆర్ పేర్కొన్నారు. నక్సలిజంతో, తీవ్రవాదంతో, సామాజిక అసమానతలతో అతలాకుతలమైన నేల తెలంగాణ నేల. ఆనాటి సమైక్య పాలనలో ఆగమైన నేల తెలంగాణ నేల. ఈ 9 ఏండ్ల కాలంలో ఎక్కడున్న తెలంగాణ ఎక్కడికి వచ్చిందో మిమ్మల్ని ఆలోచించమని కోరుతున్నాను. 2014లో 68 లక్షల మెట్రిక్ టన్నుల వరిధాన్యం పండేది. కానీ ఈరోజు మూడున్నర కోట్ల టన్నుల వరి ధాన్యాన్ని పండించి దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా నిలిచింది తెలంగాణ. పంజాబ్, హర్యానా రాష్ట్రాలను వెనకేసింది. ప్రతి వర్గం సంతోషంగా ఉంది. ఒకనాడు రూ. 200 పెన్షన్ ఉండే. ఇవాళ ఆసరా పెన్షన్ల కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ. 2 వేలు ఇస్తున్నాం. బీడీ కార్మికులతో పాటు ఒంటరి మహిళలకు, డయాలసిస్ రోగులకు పెన్షన్లు అందిస్తున్నాం. బీడీ టేకేదార్లకు కూడా పెన్షన్లు ప్రకటించారు సీఎం కేసీఆర్. ఏ ఒక్క వర్గాన్ని కూడా కేసీఆర్ వదిలిపెట్టకుండా.. కడుపులో ఉన్న బిడ్డ నుంచి మొదలుకొని.. వృద్ధుల వరకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కేటీఆర్ తెలిపారు.