రాజన్నసిరిసిల్ల జిల్లాలో ఒక్క ప్రాణనష్టం కూడా ఉండొద్దని, వర్షాలపై అధికారులు అలక్ష్యంగా ఉండకూడదని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. జిల్లాలో గురువారం ఆయన పర్యటించారు. భారీ వర్షాల నేపథ్యంలో సిరిసిల్లలోని కలెక్టరేట్లో జడ్పీ చైర్పర్సన్, కలెక్టర్, ఎస్పీ, మున్సిపల్, ఇరిగేషన్, ఇంజినీరింగ్ విభాగాలు, వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్బంగా మంత్రి కేటీఆర్ మాట్లాడారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ జూలైలో అత్యధిక వర్షపాతం నమోదైందని తెలిపారు. ప్రాథమిక సమాచారం ప్రకారం సాధారణం కంటే 450 శాతం ఎక్కువ వర్షం కురిసిందన్నారు. జిల్లాలో పెద్దపల్లి, జగిత్యాల, నిర్మల్ మాదిరి అసాధారణ పరిస్థితులు లేవన్నారు.
భారీ వర్షాలపై అధికారులు ఉదాసీనంగా ఉండకూడదని, జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం జరుగకుండా చూడాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. కలెక్టర్, ఎస్పీ, ఇరిగేషన్, ఇతర ఉన్నతాధికారులు ప్రో ఆక్టివ్ గా ఉండాలన్నారు. మున్సిపాలిటీతో సహా అన్ని గ్రామాల్లో సేఫ్టీ అడిట్ జరగాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు కఠినంగా వ్యవహరించాలన్నారు. నిర్మాణ పనులు జరిగే చోట హెచ్చరిక సంకేతాలు పెట్టాలని, బారికేడ్లు నిర్మించాలని అధికారులను ఆదేశించారు.