KTR | హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కాగా, తాజాగా మరో 9 జిల్లాల్లో 9 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ నెల 15వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకకాలంలో 9 మెడికల్ కాలేజీల తరగతులను ప్రారంభించనున్నారు.
ఈ నేపథ్యంలో మెడికల్ కాలేజీలు ప్రారంభం కానున్న కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, జయశంకర్ భూపాలపల్లి, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, జనగాం జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. మెడికల్ కాలేజీల ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. ఆయా జిల్లా కేంద్రాల్లో 15 నుంచి 20 వేల మందితో భారీ ర్యాలీలు నిర్వహించాలన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో విద్యార్థులకే కాకుండా, అనుంబంధంగా ఏర్పాటయ్యే హాస్పిటల్తో స్థానిక ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుతాయన్నారు. మెడికల్ కాలేజీల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను ప్రజలకు అర్థమయ్యే రీతిలో కార్యక్రమాలు చేపట్టాలి. ఈ కార్యక్రమాల్లో యువతను, విద్యార్థులను భాగస్వాములను చేయాలని సూచించారు. సీఎం కేసీఆర్ స్వయంగా ఒక మెడికల్ కాలేజీని సందర్శించి తరగతులు ప్రారంభించే అవకాశం ఉన్నదన్నారు. వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్ రావు కామారెడ్డిలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. 50 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు కేవలం రెండు మెడికల్ కాలేజీలు మాత్రమే దక్కాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 157 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే తెలంగాణకు ఒక్కటి కూడా ఇవ్వలేదన్నారు. జాతీయ పార్టీల మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. రెండు జాతీయ మోసం చేసినా.. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశనంలో దేశంలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందన్నారు. 15న ఒకేసారి 9 మెడికల్ కాలేజీల్లో తరగతులు ప్రారంభించి చరిత్ర సృష్టించనున్నదని అన్నారు. తెలంగాణ ఇప్పుడు ఆహార ఉత్పత్తిలోనే కాదు.. దేశ ఆరోగ్యానికి కీలకమైన డాక్టర్లను తయారుచేసే కార్ఖానాగా ఎదిగిందన్నారు కేటీఆర్.
దేశంలో అత్యధిక ఎంబీబీఎస్ సీట్లు గల రాష్ట్రం.. తెలంగాణ మాత్రమే అని మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రతి లక్ష జనాభాకు 22 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయని తెలిపారు. 2014లో చివరి స్థానంలో ఉన్న రాష్ట్రం.. నేడు అగ్రస్థానంలోకి చేరిందన్నారు. ఈ ఏడాది పెరిగిన ఎంబీబీఎస్ సీట్లలో 43 శాతం రాష్ట్రంలోనే పెరిగాయన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఉద్యమ ఒత్తిడి వల్ల నిజామాబాద్, ఆదిలాబాద్లో మాత్రమే మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రం వచ్చిన రోజు తెంలగాణలో ఐదు మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవన్నారు. ఈ ఏడాదితో ఆ సంఖ్య 26కు పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడంతో ఇప్పుడు తెలంగాణ విద్యార్థులు స్వరాష్ట్రంలో ఎలాంటి కష్టం లేకుండా వైద్య విద్యను అభ్యసిస్తున్నారని చెప్పారు. కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుతో అందుబాటులోకి వచ్చిన నూతన వైద్య సౌకర్యాలను ప్రజలకి వివరించాలని ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలకు సూచించారు.