రాజన్న సిరిసిల్ల : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ మంగళవారం ఆకస్మికంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా అధికారులతో అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. డబుల్ బెడ్రూం ఇండ్ల పనుల పురోగతిపై కేటీఆర్ సమీక్షించారు. ముస్తాబాద్ మండల పరిధిలోని చీకొడు, మోర్రయిపల్లి, ఎల్లారెడ్డిపేట మండలంలోని పదిర, బండలింగంపల్లి, అక్కపల్లి గ్రామాల్లో, గంభీరావుపేట మండలం, తంగళ్లపల్లి మండలాల్లోని పలు గ్రామాల్లో మంజూరైన ఇండ్లను సాధ్యమైనంత త్వరగా గ్రౌండింగ్ చేయాలని అధికారులను కేటీఆర్ ఆదేశించారు.
లాటరీ పద్దతిలో అత్యంత పారదర్శకంగా ఇండ్లను అర్హులకు కేటాయించాలని చెప్పారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఇండ్లు లేని అత్యంత నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను అందజేయాలన్నారు. మంజూరైన ఇండ్లను గ్రౌండ్ అయ్యేలా చూడాల్సిన బాధ్యత సంబంధిత సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, ఎంపీపీలదే అని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు మంజూరైన మొత్తం 6,886 డబుల్ బెడ్రూం ఇండ్లను పూర్తి చేయాలని కేటీఆర్ ఆదేశించారు.