హైదరాబాద్ : ముందస్తుకు పోవాల్సిన కర్మ మాకేముంది.. వాళ్లకు అంత దమ్ము, ఉబలాటం ఉంటే పార్లమెంట్ను రద్దు చేసుకొని రమ్మనండి.. మేం కూడా ఎన్నికలకు సిద్ధంగా ఉంటామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. మోదీని చెత్తబుట్టలో వేసేందుకు దేశ ప్రజలు సిద్ధంగా ఉన్నారని తేల్చిచెప్పారు. బీజేపీ నేతలకు దమ్ముంటే రమ్మనండి.. మా సత్తా ఏంటో చూపిస్తామని కేటీఆర్ అన్నారు. టైం ప్రకారం ఎన్నికలు జరుగుతాయని సీఎం కేసీఆర్ ఇప్పటికే చెప్పారు. దాని ప్రకారం ముందుకు పోతామని కేటీఆర్ స్పష్టం చేశారు.
బీజేపీ ప్రభుత్వం వస్తే ఉచిత వైద్యం, విద్య ఇస్తామని చెప్తున్నారు కదా… ఇప్పుడు దేశంలో బీజేపీ ప్రభుత్వమే ఉంది.. ఇంకెందుకు ఆలస్యం.. రేపే ఉచిత వైద్యం, విద్య అమలు చేయమను.. తాము కూడా ఆ బిల్లుకు మద్దతిస్తాం. బీజేపీ నాయకులకు సన్మానం చేస్తాం. బండి సంజయ్కు తంబాకు, లవంగాలు పెట్టి సన్మానం చేస్తామని కేటీఆర్ అన్నారు.
గుజరాత్, కర్ణాటక, బీహార్, కేరళలో మైనార్టీలకు రిజర్వేషన్లు పెంచుకోవచ్చు. తెలంగాణలో మాత్రం పెంచనివ్వరు. మా ముస్లింలు ఏం చేశారని కేటీఆర్ ప్రశ్నించారు. దేశంలో సామాజిక, ఆర్థిక పరిస్థితులను బట్టి రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించారు. కేంద్రం నిర్వహించే పరీక్షల్లో ఉర్దూ భాష పెడుతారు. కానీ తెలంగాణలో మాత్రం ఉర్దూ భాషలో పెడితే తప్పా? ఇంత చిల్లరతనం ఉండకూడదు. మా పోటీ ఇతర రాష్ట్రాలతో కానే కాదు.. తెలంగాణ మోడల్ను దేశమంతా ప్రవేశపెడుతాం. గోల్ మాల్ గుజరాత్ మోడల్ను ఎండగడుతాం.. గోల్డెన్ తెలంగాణ మోడల్ను దేశం ముందు పెడుతాం. మా ముఖ్యమంత్రి ఈ దేశాన్ని జాగృతం చేస్తారని కేటీఆర్ స్పష్టం చేశారు.