అమ్రాబాద్, ఆగస్టు 5 : అర్హులకు ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలు అందేలా అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ షమీమ్ అక్తర్ సూచించారు. నల్లమల లో చెంచులు, గిరిజనుల జీవన పరిస్థితులపై ఆయన క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. నల్లమల పర్యటనలో భాగంగా బుధవారం మండలంలోని బ్రహ్మగిరి, విష్ణుగిరిలోని కృష్ణవేణి విశ్రాంతి భవనంలో గిరిజన సంక్షేమంపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి చెంచులు, గిరిజనుల స్థితిగతులు, జీవన ప్రమాణా లు, ఆర్థిక పరిస్థితుల, సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలపై సమగ్రంగా వివరాలను తెలుసుకున్నారు.
అనంతరం బ్రహ్మగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను తనిఖీ చేసి తరగతి గదులు, ఉపాధ్యాయుల. విద్యార్థుల హాజరు నమోదు, బోధనావిధానం, పాఠశాల మౌలిక వసతులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి మెరుగైన విద్యనందిం చాలని విద్యార్థులందరూ పాఠశాలకు వచ్చేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం వటువర్లపల్లి పీహెచ్సీని తనిఖీ చేసి వైద్యులు, సిబ్బంది హాజరు, మందుల నిల్వలు పరిశీలించారు.
అలాగే మల్లయ్య పెంటలో పర్యటించి గిరిజన విద్యార్థులకు అందుతు న్న భోజన, విద్యా సౌకర్యాలు, వసతి, సంక్షేమ కార్యక్రమాలను పరిశీలించారు. గ్రామంలో చెంచు గిరిజనులతో ముఖాముఖి సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్చార్జి పీవో అచ్చంపేట ఆర్డీవో యాదగిరి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి కోటయ్య, డీఎంహెచ్వో కృష్ణ, డీఈవో రమేశ్, డీఎస్పీ శ్రీనివాసులు, తాసీల్దార్ ఉన్నారు.