హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో అత్యవసర సేవల కోసం ఇకపై ఒకే నంబర్ అందుబాటులో ఉంటుంది. ఇప్పటివరకు పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవల కోసం వేర్వేరు నంబర్లకు కాల్ చేయాల్సి వచ్చేది. ఇకపై ఈ సేవలన్నింటికీ కలిపి 112 నంబర్ అమల్లోకి వచ్చింది. డీజీపీ సీవీ ఆనంద్ బుధవారం హైదరాబాద్లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (టీజీఐసీసీసీ)లో కొత్త ఎమర్జెన్సీ కాల్ సెంటర్ను ప్రారంభించారు. దీంతో పోలీస్, అంబులెన్స్, అగ్నిమాపక సేవలు సహా 18 అత్యవసర సర్వీసులు ఒకే వేదికపైకి వస్తాయి. టీజీఐసీసీసీ నుంచి డయల్ 112 సేవలను నిరంతరం పర్యవేక్షిస్తామని, అత్యవసర సేవలను మెరుగుపర్చడమే తమ లక్ష్యమని డీజీపీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు, దోపిడీలు, గొడవలు, మహిళలపై జరిగే వేధింపులు లాంటి అత్యవసర పరిస్థితుల్లో 112కు కాల్ చేస్తే వెంటనే స్పందించేలా ఈ వ్యవస్థను రూపొందించామని తెలిపారు.
అత్యవసర సాయం కోసం ఎవరైనా 112 నంబర్కు కాల్ చేయగానే కాలర్ వివరాలు, లొకేషన్ను గుర్తించి సమీప పోలీస్ స్టేషన్, అగ్నిమాపక సిబ్బంది, సంబంధిత బృందాలకు సమాచారం పంపిస్తారని, దీంతో సహాయ చర్యలు మరింత వేగంగా ప్రారంభమవుతాయని వివరించారు. డయల్ 112 సేవలు ఏడాది పొడవునా నిరంతరం అందుబాటులో ఉంటాయని, భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను మరింత విస్తృతంగా వినియోగించి అత్యవసర సేవల సామర్థ్యాన్ని పెంచాలని తెలంగాణ పోలీస్ శాఖ లక్ష్యంగా పెట్టుకున్నదని డీజీపీ తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి శిఖాగోయల్, టెక్నికల్ డీజీపీ వీవీ శ్రీనివాసరావు, హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్, టీజీఐసీసీసీ డైరెక్టర్ వీబీ కమలాసన్రెడ్డి, సైబరాబాద్ సీపీ డాక్టర్ ఎం రమేశ్, మల్కాజిగిరి సీపీ బీ సుమతి, తెలంగాణ ఫైర్ సర్వీసెస్ డీజీ విక్రమ్సింగ్మాన్, సీఐడీ డీజీ చారుసిన్హా, పీఅండ్ఎల్ ఐజీపీ గజరావ్ భూపాల్, టీజీటీఎస్ ఎండీ సత్యనారాయణరెడ్డి, మల్టీజోన్-1 ఐజీపీ ఎస్ చంద్రశేఖర్రెడ్డి, సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.