Minister KTR | నిజామాబాద్, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తే దళారీ రాజ్యం వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నా రు. యాభై ఏండ్లపాటు పదిసార్లు ఆ పార్టీకి ఓటేసి అవకాశం కల్పిస్తే చేసిందేమీ లేదని విమర్శించారు. మంత్రి కేటీఆర్ సోమవారం కామారెడ్డి జిల్లాలో సుడిగాలి పర్యటన చేశారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రూ.55 కోట్ల తో తలపెట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో ఆయన పాల్గొన్నారు. ఎల్లారెడ్డి, కామారెడ్డి నియోజకవర్గాలకు రూ.45 కోట్ల చొప్పున మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో వచ్చిన ఆయన మొదట కామారెడ్డి జిల్లా కేంద్రంలో స్వాగత తోరణాన్ని, ఆరు వరుసల రహదారులు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ను మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, ఎంపీ బీబీపాటిల్, ఉర్దూ అకాడమీచైర్మన్ ముజీబుద్దీన్, కలెక్టర్ జితేశ్ వీ పాటిల్, జడ్పీ చైర్మన్ దఫేదార్ శోభతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కలియ తిరిగారు. తాడ్వాయిలో స్పోర్ట్స్ కాంప్లెక్స్కు స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్, జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండేతో కలిసి శంకుస్థాపన చేశారు. ఎల్లారెడ్డి పెద్ద చెరువుపై నిర్మించిన హై లెవల్ బ్రిడ్జి, బీటీ రోడ్లు, చిల్డ్రన్ పార్కును ప్రారంభించి ఆర్టీసీ బస్టాండ్, సమీకృత మార్కెట్, మున్సిపల్ కొత్త భవనాల నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం ఎల్లారెడ్డి శివారులో జీవధాన్ పాఠశాల పక్కన మైదానంలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రసంగించారు.
ఆ ప్రసంగం ఆయన మాటల్లోనే..వజ్రం లాంటోడు జాజాల సురేందర్
ఎల్లారెడ్డి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తున్నది. మీ ఎమ్మెల్యే ఎప్పుడు సీఎం కేసీఆర్ను కలిసినా అభివృద్ధి కోసమే మాట్లాడుతాడు. వెంటపడి నిధుల కోసం కొట్లాడే వ్యక్తి ఎమ్మెల్యే జాజాల. 2001 నుంచి 2004 వరకు కేసీఆర్కు తమ్ముడిలా పనిచేశారు. ఎక్కడికి వెళ్లినా వెన్నంటి ఉన్నారు. పార్టీ ఇప్పుడు సర్వహంగులతో ఉన్నది. బ్రహ్మాండంగా ఉన్నది. నాయకత్వ పటిమ పెరిగింది. మీటింగ్కు వచ్చే ముందు నిధులివ్వాలని అడిగిండు. ఆదివారం అధికారులను లేపి ఇందుకోసం జీవోలు ఇప్పించినం. వెల్లుట్ల-వెంకటాపూర్కు రూ.2.70 కోట్లు, కల్యాణి-రత్నాపూర్ వంతెనకు రూ.2.40 కోట్లు, బస్వాపూర్-సోమారం రోడ్డుకు రూ.3.50 కోట్లు, రామారెడ్డి మండలంలో ఉప్పల్వాయి-మోసంపూర్ రహదారి, సదాశివనగర్లో అమర్లాబండ వద్ద రూ.2.20 కోట్లతో బ్రిడ్జి, ఎల్లారెడ్డిలో మరో బీటీ రోడ్డు, సోమర్లబండ తండాలో మరో రోడ్డు, ఎల్లారెడ్డిలో పీడబ్ల్యూడీ రోడ్డు 3 కిలోమీటర్లు.. ఇలా మొత్తం రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నాం. ఇందుకోసం ఆ వేదికపైనే మీ ఎమ్మెల్యేకు జీవో కాపీ అందిస్తున్నా. అట్లాగే ఎల్లారెడ్డి నియోజకవర్గంలో మేజర్ గ్రామ పంచాయతీల అభివృద్ధికి మరో రూ.25 కోట్లు మంజూరు చేస్తూ ఇంకో జీవో ఇస్తున్నా. మొత్తం మీ నియోజకవర్గానికి రూ.45 కోట్లు ఇచ్చాం. వెంటనే పనులు ప్రారంభిస్తాం.
రేవంత్ మనసుల మాట చెప్పిండు
రైతుబంధు ఇవ్వాలనే ఆలోచన కాంగ్రెస్ రాబందులకు ఏనాడైనా వచ్చిందా? యాభై ఏండ్లు 10 సార్లు ఓట్లు వేస్తే కరెంట్ సక్కగా ఇచ్చిండ్రా? రేవంత్రెడ్డి ఏమంటున్నడు. తెలంగాణలో ఉండేది అంతా చిన్న రైతులే. వారి పొలాలకు సాగు నీరు పారించుకోవాలంటే 3 గంటల కరెంట్ సరిపోతుందని అమెరికాలో మనసు విప్పి చెప్పిండు. 3 గంటల కంటే ఎక్కువ ఎందుకు అంటుండు. ఎల్లారెడ్డి రైతులు ఆలోచన చెయ్యాలి. తెలంగాణ రాక ముందు ఎట్లుండే కరెంటు? ఇప్పుడెట్లా ఉన్నది? ఎవరైనా ఊర్లలో చనిపోతే అంత్యక్రియలు అయినంక స్నానాలకు 20 నిమిషాలు కరెంట్ కోసం దండం పెట్టిన కాలం మరిచినమా? కరెంట్ ఇవ్వాలని అడుక్కున్నది మరిచిపోదామా? రేవంత్రెడ్డే తన నాయిన చనిపోతే స్నానాలు చేసేందుకు కరెంట్ కోసం కరెంటోళ్లను బతిమిలాడుకున్నానని నిండు అసెంబ్లీలోనే చెప్పిండు కదా! ఇంతటి దౌర్భాగ్యాన్ని కాంగ్రెస్ పాలనలో చూడలేదా? ఎరువులు పంచే తెలివి వారికి లేదు. విత్తనాలు సక్రమంగా పంచిన ముఖం లేదు. పోలీస్ స్టేషన్లో విత్తనాలు పంచిన దౌర్భాగ్యపు పాలన కాంగ్రెస్ వారిది కాదా? అర్ధరాత్రి కరెంట్ కోసం పొలాల్లోకి పోయి పాముకాట్లకు, తేలు కాట్లకు ఆగమాగమైనం. నెర్రెలు బారిన నేలలు, నెత్తుపారిన ప్రాంతం. తీవ్రమైన దుర్భిక్షంతో మనమంతా కాంగ్రెస్ పాలనలో కొట్టుమిట్టాడలేదా? ఎల్లారెడ్డిలోనే అత్యధికంగా వరి సాగు అవుతున్నది. ఇక్కడ 395 చెరువులు బాగు చేశాం. నీళ్లు బ్రహ్మాండంగా వస్తున్నాయి. భూగర్భ జలం పైకి వచ్చింది. కాంగ్రెస్ను తెచ్చుకుని మళ్లీ బొక్కబోర్లా పడదామా? 35 వేల ఓట్ల మెజార్టీతో జాజాల సురేందర్ గత ఎన్నికల్లో గెలిచిండు. ఈసారి డబుల్ మెజార్టీతో 75 వేల ఓట్ల ఆధిక్యాన్ని ఇవ్వాలి. ఎల్లారెడ్డికి శాశ్వత ఎమ్మెల్యేగా నిలపాలి.
రాష్ట్రంలో ప్రజలకు కాంగ్రెస్, బీజేపీ చేసింది చెప్పుకునే దమ్ముందా? దమ్ముంటే కాంగ్రెస్, బీజేపీ ఏం చేసినవో చెప్పి ఓట్లడగాలి. నన్ను అడిగితే ప్రతి ఒక్క రంగానికి ఇచ్చింది చెప్తా. వెయ్యి గురుకులాలు పెట్టింది నిజం కాదా? పోడు భూములకు పట్టాలు, తండాలను జీపీలుగా మార్చింది నిజం కాదా? దళితబంధు నిజం కాదా? నాయి బ్రాహ్మణులు, రజకులకు కరెంట్ ఫ్రీగా ఇస్తున్నది నిజం కాదా? పద్మశాలీలు, ముదిరాజ్లు, గౌడులకు మేలు జరుగలేదా? రాష్ట్రంలో బీడీ కార్మికులకు పింఛన్లు గతంలో ఇచ్చిండ్రా? బీడీ కార్మికులతో పాటుగా టేకేదార్లకూ పింఛన్ ఇస్తున్నాం. కాంగ్రెసోడు ఉన్నప్పుడు రూ.200 పింఛను ఉంటే ఇప్పుడు రూ.2 వేలు ఇస్తున్నం. దివ్యాంగులకు రూ.500 నుంచి రూ.4 వేలు పెంచినం. కాంగ్రెసోళ్లు ఏదంటే అది ఫ్రీ అంటరు. 25 గంటల కరెంట్ అని కూడా అంటరు. దినంలో లేని గంటను కూడా చేర్చుతరు. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. బీజేపోడు ఏం నరికిండు. 2014లో జన్ ధన్ కాతా కోలో, ధన్ధన్ పంద్రా లాక్ దేతూ అంటూ ప్రధాని మోదీయే అన్నడు. ఒక్క పైసా మన ఖాతాలో పడలేదు. కానీ గుండు కొట్టిండు. సిలిండర్ ధర రూ.400 చేస్తే మన్మోహన్సింగ్ను 400 తిట్లు తిట్టిండు. ఆడబిడ్డలం తా సిలిండర్కు దండం పెట్టి నాకు ఓటెయ్యాలన్నడు. రూ.400 చేస్తేనే 400 తిట్లు తిట్టిన మోదీని రూ.1,200 చేసినందుకు ఎన్ని తిట్టా లి? బీజేపీకి పిండం పెట్టాలి. పిరమైన ప్రధానికి మనం తప్పకుండా ఓటు ద్వారా బుద్ధి చెప్పాలి. ఎల్లారెడ్డిలో బీజేపీకి డిపాజిట్ గల్లంతు కావాలి. మనకు ఉన్నది ఒక్కటే రామబాణం కేసీఆర్. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేది కేసీఆరే. కాం గ్రెస్, బీజేపోళ్లతో ఊదు కాలది పీరు లేవది. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉంటే నిర్ణయాలు ఢిల్లీలోనే జరుగుతాయి. బాత్రూం పో వాలంటే ఢిల్లీ పర్మిషన్ అవసరమయ్యే బేకార్గాళ్లు, చాతకానివాళ్లు. ఆత్మగౌరవానికి ప్రతీక కేసీఆర్తో వీళ్లు పోటీయా? దేశ రాజకీయ వ్యవస్థను ఒప్పించి రాష్ట్రం తెచ్చిన సంచలన నాయకుడు కేసీఆర్. మరో దిక్కు సంచులు మోసే దిక్కుమాలినోడు కాంగ్రెస్ నాయకుడు. వీళ్లు కేసీఆర్కు పోటీయా?’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్కు రైతులు, పేదలు రెండు కండ్లు: వేముల
రైతులు, పేదలు రెండు కండ్లుగా భావించి దేశంలో ఎవ్వరూ చేయని కా ర్యక్రమాలను సీఎం కేసీఆర్ చేసి చూపిస్తున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో వ్యవసాయం, రైతుల కోసం అనేక కార్యక్రమాలు అ మలవుతున్నాయి. 24 గంటలు కరెం ట్, రైతుబీమా, రైతుబంధు, అనేక కా ర్యక్రమాల ద్వారా వ్యవసాయం పం డుగలా మారిందని తెలిపారు. 75 లక్షల టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి నుంచి మూడున్నర కోట్ల టన్నులకు చేరిందని, అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్వన్ రాష్ట్రంగా మారిందని వెల్లడించారు. తలసరి ఆదాయం రూ.లక్ష 12 వేల నుంచి రూ.3.17 లక్షలకు పెరిగిందంటే కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, కేటీఆర్ పాత్ర ఎంతో ఉన్నదని ప్రశంసించారు. వ్యవసాయ రంగం అభివృద్ధితో పాటు పారిశ్రామికవేత్తలను తన తెలివితో ఒప్పించి, మెప్పించి తెలంగాణలో 3 లక్షలకు పైగా పెట్టుబడులు, 20 వేలకు పైగా పరిశ్రమలు, 16 లక్షల ఉద్యోగాలు సృష్టించింది కేటీఆరేనని, ఐటీ రంగం రూ.57 వేల కోట్ల ఎగుమతుల నుంచి రూ.3.50 లక్షల కోట్లకు పెరగడానికి కారణం కేటీఆర్ అని వివరించారు. ఉమ్మడి జిల్లాలోని 7 మున్సిపాలిటీలకు కేసీఆర్ పాలనలో రూ.1,751 కోట్ల నిధులు వెచ్చించామని, నభూతో నభవిష్యత్తు అన్న రీతిలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్రెడ్డి, జుక్కల్ ఎమ్మెల్యేలు హన్మంత్షిండే, రసమయి బాలకిషన్, మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులుగౌడ్, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
3 గంటల కరెంటా? 3 పంటల కేసీఆరా?
మూడు పంటలకు కరెంట్ ఇచ్చే కేసీఆర్ కావాల్నా? 3 గంటలు కరెంట్ ఇచ్చే కాంగ్రెస్ కావాల్నా? మతం పేరుతో మంటలు రేపే బీజేపోడు కావాల్నా? ప్రజలంతా ఆలోచన చేయా లి. బీజేపోడిది నెత్తి కాదు, కత్తి కాదు. హిందూముస్లింల నడుమ కొట్లాటలు పెట్టుడు తప్ప వారికి అభివృద్ధి పట్టదు. కాంగ్రెస్కు అవకాశమిస్తే రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీ బంధు అన్నీ రద్దు అవుతాయి. మళ్లీ దళారుల రాజ్యం వస్తది. సినిమా రీల్ మాదిరిగా వారి పాలనను గుర్తుకు తెచ్చుకోండ్రి. యాభై ఏండ్లలో ఏమీ చేయని కాంగ్రెస్ మాటలు నమ్ముదామా? వీళ్లంతా కొత్తోళ్లా? గదే షబ్బీర్ అలీ.. గదే పాచిపోయిన ముఖాలు కావా? కాంగ్రెస్ మాటలు విచిత్రంగా ఉన్నాయి. షబ్బీర్ అలీ ఇప్పుడు గడప గడపకు కాంగ్రెస్ అంటూ తిరుగుతున్నడు. యాభై ఏండ్లలో ఎందుకు చేయలేదు? మీ ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మొదటిసారి గెలిచి మంచిగా చేస్తుండు. కామారెడ్డికి జిల్లాను ఇచ్చిందీ, కలెక్టరేట్, ఎస్పీ ఆఫీస్, మెడికల్ కాలేజీ తెచ్చిందీ బీఆర్ఎస్. గిన్ని పనులు చేసింది మనం కాదా? నిన్నటివరకు మనల్ని చావకొట్టినోడు, ఎక్కడికక్కడ చంపినోడు, మళ్లీ వాడే వచ్చి గీ రోడ్డు గిట్లెందుకు ఉన్నది? గట్లెందుకు ఉన్నది? అని అడుగుడేంది? యాభై ఏండ్ల వారి పాలనలో గుడ్డిగుర్రాల పళ్లు తోమిండ్రా? తెలంగాణ వ్యాప్తంగా రూ.73 వేల కోట్లు రైతుబంధు అందిస్తే అందులో లక్షా 3 వేల మందికి రైతుబంధు ఎల్లారెడ్డిలోనే వస్తున్నది. డబ్బు ఖాతాలో పడగానే టింగ్ టింగ్ టింగ్మంటూ మెసేజ్లతో ఫోన్లు మోగుతున్నాయి. రైతు చచ్చిపోతే రైతుబీమా ద్వారా ఆదుకుంటున్నది కేసీఆరే. ఇలా ప్రపంచంలో ఎవ్వరూ ఆలోచించలే. ఎల్లారెడ్డిలోనే 2,043 మందికి రైతుబీమా అందింది. కల్యాణలక్ష్మి 6,636 మంది కి, 557 మందికి షాదీముబారక్ అందించిండ్రు. మీ ఎమ్మెల్యే చెక్కుతో పాటుగా పట్టుచీర అదనంగా పెడుతుండు. గొల్ల కుర్మలకు 5,161 యూనిట్లు ఇచ్చారు. రెండో విడత మొదలైంది. అందరికీ వస్తది. ఎల్లారెడ్డిలో 4.67 కోట్ల చేప పిల్లలు 400 చెరువుల్లో వదిలినం. మత్స్య సంపద పెంచింది కేసీఆరే.