నిజామాబాద్ : తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి నిత్య విద్యార్థి అని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసల జల్లు కురిపించారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కావడం ఇక్కడి ప్రజల అదృష్టమని మంత్రి పేర్కొన్నారు. నిత్య విద్యార్థి మాదిరిగా పోచారం పని చేస్తున్నారు. పద్ధతి, ప్రణాళిక ప్రకారం గ్రామాలకు, పట్టణాలకు పోచారం నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తున్నారు అని కేటీఆర్ కొనియాడారు.
బాన్సువాడ నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. రూ. 120 కోట్ల వ్యయంతో నిర్మించే సిద్ధాపూర్ రిజర్వాయర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం సిద్దాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూం ఇండ్లకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ ప్రసంగించారు.
రాష్ట్రంలోనే అత్యధికంగా బాన్సువాడ నియోజకవర్గానికి 10 వేల డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు అయ్యాయని కేటీఆర్ గుర్తు చేశారు. కేసీఆర్ వద్ద స్పీకర్ పట్టుబట్టి అత్యధిక డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు చేయించుకున్నారు. మరో నాలుగైదు వేల ఇండ్లు కావాలని కోరాడు. పోచారం మొండిపట్టు బట్టి సాధించారు. బాన్సువాడ మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నామని కేటీఆర్ తెలిపారు. నిజాం సాగర్ నీళ్ల కోసం ఎన్నో ధర్నాలు, పోరాటాలు, ముష్టి యుద్ధాలు చేయాల్సి వచ్చేది. కానీ గోదావరి జలాలను మన పొలాల్లోకి మళ్లించారు సీఎం కేసీఆర్. మేడిగడ్డ నుంచి నీళ్లను ఎత్తిపోసి కొండపోచమ్మ సాగర్కు తీసుకువస్తున్నాము. నిజాం సాగర్ ఆయకట్టుకు అద్భుతంగా నీళ్లు ఇస్తున్నాం. బాన్సువాడ అత్యధిక పంటలు పండించే నియోజకవర్గంగా మారుతుందన్నారు. ఈ ప్రాంత సౌందర్యం అద్భుతంగా ఉందన్నారు. ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
సిద్దాపూర్ తండాలో 40 డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించడం గొప్ప విషయమన్నారు. రూ. 300 కోట్లతో రహదారుల నిర్మాణం చేపట్టారు. రూ. 20 కోట్లతో 100 పడకల మాతాశిశుసంరక్షణ ఆస్పత్రిని కట్టుకున్నాం. ప్రతి మండలంలో ఒక గురుకుల పాఠశాల ఏర్పాటు చేశారు. బీఎస్సీ నర్సింగ్ కాలేజీని మంజూరు చేశాం. బాన్సువాడ పట్టణం రూపురేఖలు మారిపోయాయి అని కేటీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో సీఎం శ్రీ కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం ముందుకు వెళ్తున్నది. వర్ని మండలంలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు నిర్మించే సిద్దాపూర్ రిజర్వాయర్ పనులకు స్పీకర్ @PSRTRS, మంత్రులు @KTRTRS, @VPRTRS శంకుస్థాపన చేశారు. pic.twitter.com/Ie4gNNhDRn
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) February 16, 2022