నారాయణపేట : నారాయణపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. జిల్లా కేంద్రమైన నారాయణపేటకు అన్ని హంగులు ఉండాలనే ఉద్దేశంతో.. పట్టువదలని విక్రమార్కుడిలా.. రాజేందర్ రెడ్డి అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. నారాయణపేట జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
ఈ ఒక్క రోజే నారాయణపేట జిల్లాలో రూ. 196 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశామని తెలిపారు. అద్భుతమైన కొత్త మార్కెట్ను నిర్మించారు. ఈ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ను చూసి మంత్రి నిరంజన్ రెడ్డి ఈర్ష్య పడ్డారు. మార్కెట్ డిజైన్ బాగుందని నిరంజన్ రెడ్డి ప్రశంసించారు. వనపర్తిలో స్థలం లేక కట్టించలేకపోయాను అని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసినట్లు కేటీఆర్ తెలిపారు. మంత్రులు కూడా ఈర్ష్య పడేలా అభివృద్ధి చేస్తున్న రాజేందర్ రెడ్డికి అభినందనలు తెలుపుతున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు.
కొండారెడ్డిపల్లె చెరువులో బతుకమ్మ ఘాట్, గణేశ్ నిమజ్జనం కోసం ప్లాట్ఫాం, మినీట్యాంక్ బండ్ ఏర్పాటు చేశారు. గతంలో చెరువు వద్దకు వెళ్లేందుకు దారి లేకుండా ఉండే. కానీ ఇప్పుడు బ్రహ్మాండమైన రోడ్డు వేసి, మినీ ట్యాంక్బండ్ను అందజేశారు. రాష్ట్రంలో సీనియర్ సిటిజెన్ పార్కు ఎక్కడా లేదు. కానీ నారాయణపేటలో రూ. 80 లక్షలతో సీనియర్ సిటిజెన్స్ కోసం పార్కును ఏర్పాటు చేశారు. జిల్లాకు డిగ్రీ, అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ కావాలని అడిగి తెచ్చుకున్నారు.
జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయానికి శంకుస్థాపనం చేశాం. కొద్ది నెలల్లోనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తాం. రూ. 10 కోట్లు రామాలయానికి, మైనార్టీ సోదరుల కోసం రూ. 2 కోట్లతో ఈద్గా నిర్మాణానికి శంకుస్థాపనలు చేశాం. ఇంటిగ్రేటెడ్ మండల కార్యాలయానికి మరికల్లో రూ. 7 కోట్లతో శంకుస్థాపన చేసుకున్నాం. ఈ రకంగా పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసుకున్నామని తెలిపారు. నారాయణపేటలో రోడ్లు బాగా అయ్యాయి. మంచి మార్కెట్, డంపింగ్ యార్డ్, సైన్సు పార్కులు, చేనేత సమూహాలు ఏర్పాటు చేశారు అని కేటీఆర్ పేర్కొన్నారు.