దుబ్బాక, ఆగస్టు19 : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏ పేరిట దోపిడీకి పాల్పడుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మండిపడ్డ్డారు. బుధవారం సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్లో ఓ ప్రైవేట్ ఫంక్షన్హాల్ ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యం రైస్మిల్లర్లు పక్కదారి పట్టించి అక్రమార్జనకు పాల్పడుతున్నారని ఆరోపించారు. గుంతల రోడ్లతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేసేందుకు ప్రభుత్వం 22ఏ తీసుకొచ్చిందని మండిపడ్డారు.
ప్రధానంగా 22ఏ కింద నిషేధిత భూములు చేర్చి సామాన్య ప్రజలను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తున్నదని మండిపడ్డారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పొంగులేటి వ్యవహారశైలిపై ఎమ్మెల్యే పలు ప్రశ్నలు సంధించారు. అక్రమ సాంపదన కోసమే మంత్రి 22ఏ తెచ్చారని విమర్శించారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి చెబుతున్నారన్నారు. అవినీతికి పాల్పడుతున్న మంత్రిపై ముఖ్యమంత్రి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. పొంగులేటికి ఐదేండ్ల కిందట ఉన్న ఆస్తులు ఇప్పుడు ఉన్న ఆస్తులపై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రంగారెడ్డి, హైదరాబాద్ ప్రాంతాల్లో దుబ్బాక ప్రజలు అపార్ట్మెంట్లు, ఇంటి స్థలాలు కొనుగోలు చేశారని, ఇప్పుడు 22ఏ ద్వారా వాటిపైన బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదన్నారు. విక్రయిద్దామంటే రిజిస్ట్రేషన్లు కాక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజా ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం 22ఏలో కొట్టుకపోవడం ఖాయమన్నారు. రైతుల ధాన్యాన్ని రైస్ మిల్లర్లు పక్క రాష్ర్టాలకు తరలించి అక్రమార్జనకు పాల్పడుతుంటే మరోపక్క ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. అవినీతి ఆరోపణలపై అధికారులను సస్పెండ్ చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అవే అవినీతి ఆరోపణలు ఉన్న మంత్రుల విషయంలో స్పందించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయన్నారు. దుబ్బాక నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి చూసేందుకు మంత్రి కోమటిరెడ్డి రావాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు రవీందర్రెడ్డి, కిషన్రెడ్డి, గుర్రాల శ్రీనివాస్, దేవరాజ్, ఆస యాదగిరి, బీమాసేన, పండు, కమాలాకర్రెడ్డి, బాపురెడ్డి, సత్యానారాయణ, లింగం పాల్గొన్నారు.