సొంత స్థలంలో ఇండ్లు కట్టుకునే వారికి బడ్జెట్లో నిధులు కేటాయింపు
అభివృద్ధ్దికి మారుపేరు సిద్దిపేట
మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్
516 మంది దివ్యాంగులకు ఉపకరణాలు అందజేత
సిద్దిపేట పట్టణ ప్రగతి నివేదిక ఆవిష్కరణ
దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన మంత్రులు
సిద్దిపేట అర్బన్, ఏప్రిల్ 14 : దేశంలోనే ఎక్కువ మొత్తం పింఛన్ అందజేస్తూ దివ్యాంగులను అండగా నిలిచిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ అని, అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రులు తన్నీరు హరీశ్రావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్టీపర్పస్ హైస్కూల్లో రాష్ట్ర దివ్యాంగుల ఆర్థిక సహకార సంస్థ ఆధ్వర్యంలో శారీరక దివ్యాంగులకు ఉపకరణాలు అందజేశారు. ముందుగా సిద్దిపేట పట్టణ ప్రగతి నివేదికను మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. దివ్యాంగులను చిన్నచూపు చూడడం తగదన్నారు. వారిని అవమానిస్తే కఠినంగా శిక్షిస్తామన్నారు. 516 మంది లబ్ధ్దిదారులకు రూ.80 లక్షల విలువచేసే ఉపకరణాలు పంపిణీ చేస్తున్నామని, దరఖాస్తు చేసుకున్న దివ్యాంగులందరికీ ప్రభుత్వం ఉపకరణాలు అందిస్తుందని తెలిపారు. అభివృద్ధికి మారుపేరు సిద్దిపేట అని, ప్రజల అవసరాలే ఎజెండాగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. అందుకే సిద్దిపేటకు 10 జాతీయ స్థాయి అవార్డులు వరించాయన్నారు. సిద్దిపేట పట్టణ ప్రగతి నివేదిక ఇక్కడి ప్రజల ఆత్మగౌరవాన్ని చాటి చెబుతుందన్నారు. సొంత స్థలంలో ఇండ్లు కట్టుకునేందుకు ముందుకొచ్చే వారికి సాయం చేసేందకు ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించిందన్నారు.
సిద్దిపేట అభివృద్ధి భేష్
మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మంత్రి హరీశ్రావు సిద్దిపేటను గొప్పగా అభివృద్ధ్ది చేసి, సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారని కొనియాడారు. సిద్దిపేటలో నాటికి నేటికి చాలా మార్పు కనిపిస్తున్నదన్నారు. ఉద్యమం ద్వారా సాధించిన తెలంగాణను సీఎం కేసీఆర్ అదే స్ఫూర్తితో దేశంలోనే నెంబర్వన్గా తీర్చిదిద్దారన్నారు. సీఎం కేసీఆర్ దివ్యాంగులకు కొండంత అండగా నిలిచారని, దేశంలో ఎక్కడా లేని విధంగా రూ.21 కోట్లతో 17 వేల మందికి ఉపకరణాలను ఉచితంగా అందిస్తున్నామని తెలిపారు.అనంతరం దివ్యాంగులతో కలిసి మంత్రులు హరీశ్రావు, ఈశ్వర్లు సహపంక్తి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ వేలేటి రోజాశర్మ, ఎమ్మెల్సీ ఫారూఖ్హుస్సేన్, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ఖాన్, మున్సిపల్ చైర్మన్ కడవేర్గు రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.