హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): ఒక్కసారిగా 14 ఏండ్ల కిందటి సన్నివేశాలు పునరావృతమయ్యాయి. తెలంగాణభవన్లో బుధవారం ఉద్యమకాలం నాటి ఉత్కంఠ వాతావరణం నెలకొన్నది. పోలీసులు నాటి అత్యుత్సాహాన్నే ప్రదర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన దీక్షా దివస్ కార్యక్రమంపై ఆంక్షలు విధించారు. ఎట్టిపరిస్థితుల్లో నిర్వహించకూడదని బీష్మించారు. 2009 నవంబర్ 29వ తేదీని తెలంగాణ సమాజం మరచిపోదని, తెలంగాణ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో.., తెలంగాణ జైత్రయాత్ర.. కేసీఆర్ శవయాత్ర’ అంటూ ఆమరణ నిరాహారదీక్ష చేపట్టడం ద్వారా తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైందని, 2010 నంచి తాము క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని ఇప్పుడెందుకు తమను అడ్డుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు పోలీసులతో వాదించారు.
ఒక దశలో తెలంగాణభవన్ నుంచి ఎవరూ బయటకు రాకూడదని, బయట నుంచి ఎవరూ లోపలికి వెళ్లకూడదని పోలీసులు ఆంక్షలు విధించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున దీక్షా దివస్ నిర్వహించొద్దని పోలీసులు తేల్చి చెప్పారు. ఆనవాయితీగా నిర్వహిస్తున్న దీక్షా దివస్ను అడ్డుకోవడం అన్యాయమని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, పార్టీ జనరల్ సెక్రటరీ సోమా భరత్కుమార్ తదితరులు పోలీసులకు తెలిపారు. పోలింగ్ కేంద్రానికి 200 మీటర్ల దూరంలో తెలంగాణభవన్ ఉన్నదని, తాము నిబంధనల ప్రకారమే తమ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, తెలంగాణభవన్ ప్రాంగణంలో నిర్వహించుకొనే స్వేచ్ఛ తమకు ఉన్నదని తేల్చిచెప్పారు. వాదనలు.. చర్చోపచర్చలు నిర్వహించిన అనంతరం పోలీసులు తెలంగాణభవన్లో కార్యక్రమాలు నిర్వహించుకోవడానికి అనుమతి ఇచ్చారు.
తెలంగాణభవన్ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి, భవన్లో ఉన్న ఆచార్య కొత్తపల్లి జయశంకర్ విగ్రహానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖల మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ నవీన్కుమార్, మాజీ ఎమ్మెల్సీ శ్రీనివాస్రెడ్డి, పార్టీ నేతలు నాయినేని రాజేశ్వర్రావు తదితరులో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కాగా, రాష్ట్ర సాధనను సాకారం చేసిన కేసీఆర్ దీక్షా దివస్ను ఎన్నారైలు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించారు. అన్ని దేశాల్లోని ఎన్నారైలు సీఎం కేసీఆర్ పోరాటాన్ని స్మరించుకునట్టు బీఆర్ఎస్ ఎన్నారై కో ఆర్డినేటర్ మహేశ్ బిగాల తెలిపారు.
దీక్షా దివస్ సందర్భంగా మంత్రి కేటీఆర్ రక్తదానం చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. పలువురు ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల నాయకులు, పార్టీ నేతలు, వివిధ అనుబంధ సంఘాల నేతలు రక్తదానం చేశారు.