KTR | కరీంనగర్ : ధర్మపురి ఎమ్మెల్యే, ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిజంగా ధర్మరాజే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. ధర్మపురి పేరులోనే ధర్మం ఉంది.. మీ ఓటులోనూ ధర్మం ఉండాలి. 50 వేల ఓట్ల మెజార్టీతో ఈశ్వరన్నను గెలిపించాలి. అప్పుడే ధర్మం ఉన్నట్లు లెక్క.. లేకపోతే నిజంగా ధర్మం లేనట్టే అని కేటీఆర్ పేర్కొన్నారు. ధర్మపురి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కొప్పుల ఈశ్వర్తో కలిసి మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.
వెంకటేష్ నేత మాట్లాడుతూ ధర్మపురి ధర్మరాజు కొప్పుల ఈశ్వర్ అని అన్నారు.. నిజంగా కూడా ఈశ్వరన్న చల్లటి మనిషి, సౌమ్యుడు, మృదుస్వభావి అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎప్పుడన్న ఏందన్నా అడిగినా.. అవతలి వాళ్లు ఏదన్న నొచ్చుకుంటారేమోనని చెప్పి మెల్లగా అడిగే నాయకుడు కొప్పుల ఈశ్వరన్న. నాకు తెలిసి ఇంత సౌమ్యుడు రాజకీయాల్లో ఇంత దూరం, ఇంత ఉన్నత స్థానానికి రావడం మామూలు విషయం కాదు. ఎందుకంటే ఒక్కసారి తన కేరీర్ చూస్తే 1976, నవంబర్లో 17 ఏండ్ల వయసులో సింగరేణిలో పని చేయడం ప్రారంభించారు. 1976 నుంచి దాదాపు 26 ఏండ్లు సిగరేణిలో పని చేశారు. అంచెలంచెలుగా ఎదుగుతూ రాజకీయాల్లోకి వచ్చానని ఈశ్వరన్న చెప్పారు. అల్టిమేట్గా కేసీఆర్ ఆశీర్వాదంతో, ప్రజల ప్రేమతో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యానని చెప్తే గొప్పగా అనిపించింది. ఒక పేద కుటుంబం నుంచి వచ్చి, కార్మికుడిగా జీవితం మొదలుపెట్టి.. 22 ఏండ్ల కిందట కేసీఆర్తో తమ్ముడిలా అటాచ్ అయిన తర్వాత.. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఉద్యమంలో ఎత్తులు పల్లాలు చూశారు. కొన్ని సందర్భాల్లో ఓడిపోయారు.. కొన్ని సందర్భాల్లో గెలిచారు. కానీ ఈశ్వరన్న గొప్పదనం ఏంటంటే.. గెలిచినా, ఓడినా, అన్నింట్లో కేసీఆర్కు ఒక తమ్ముడిలా, నిబద్ధత కలిగిన సైనికుడిలా కలిసిమెలిసి ఉన్నారని కేటీఆర్ కొనియాడారు.
నేను కొప్పుల ఈశ్వర్కు ఫ్యాన్ అయిపోయాను అని కేటీఆర్ గుర్తు చేశారు. ఎప్పుడు అయ్యాను అంటే.. నాకు బాగా గుర్తున్న సందర్భం చెబుతున్నా. 2009 ఎన్నికలప్పుడు మనం అనుకున్న ఫలితాలు రాలేదు. 46 సీట్లలో పోటీ చేస్తే కేవలం 10 స్థానాల్లో గెలిచాం. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది.. రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యారు. అయిన తర్వాత ఒకటే స్టేట్మెంట్లు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి పోతున్నట్లు పేపర్లు, టీవీల్లో వార్తలు. మన నాయకులను ప్రలోభపెట్టి గుంజుకుపోవడం. తెలంగాణ ఉద్యమాన్ని గొంతు నులిమి చంపే ప్రయత్నం జరుగుతున్న రోజులు. ఈశ్వర్ చాలా మంది పార్టీలో నుంచి వెళ్తున్నారట కదా.. మీరు కూడా పోతున్నారా? అని ఓ విలేకరి అడిగారు. ఆయన ఎంత గొప్ప మాట అన్నారంటే.. మీరు రాసిపెట్టుకోండి. రేపు పేపర్ల రాయండి. కేసీఆర్తో ఇవాళ ఉన్నాను. రేపు ఉంటాను చచ్చేదాకా ఉంటాను. ఒక వేళ ఏదైనా పరిస్థితుల్లో కేటీఆర్, హరీశ్రావు ఇద్దరూ విడిచిపెట్టి పోయినా నేను మాత్రం కేసీఆర్తోనే ఉంటానని చెప్పారు. అది నాయకుడి కమిట్మెంట్, క్యారెక్టర్ అని కేటీఆర్ ప్రశంసించారు.
చెరువు నిండిన తర్వాత కప్పలు మస్తు వస్తయ్.. కష్టంలోనే తెలుస్తది మనోడు ఎవడు.. మందోడు ఎవడో అని కేటీఆర్ తెలిపారు. గర్వంగా చెబుతున్నా.. ఈశ్వరన్న లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఆయనతోటి ఒక్క పంచాయితీ ఉండదు. ఎవరితోనూ కొట్లాట ఉండదు. నవ్వుతూ మాట్లాడుతాడు. పద్ధతిగా, వినయంగా, మర్యాదగా అందర్నీ దగ్గరికి తీసుకొనే వ్యక్తి. అందుకే ఇవాళ ధర్మపురిలో ఆయనను ధర్మరాజు అని పేరు పెట్టుకున్నారంటే ఆయన పక్కా ధర్మరాజే. నేనైతే ఆశిస్తున్నా.. ధర్మపురి పేరులోనే ధర్మం ఉంది.. మీ ఓటులోనూ ధర్మం ఉండాలి. 50 వేల ఓట్ల మెజార్టీతో ఈశ్వరన్నను గెలిపించాలి. ధర్మం ఉన్నట్లు లెక్క. లేకపోతే నిజంగా ధర్మం లేనట్టే. ఇంత పని చేసినా తర్వాత.. ఇన్నిరకాలుగా అభ్యర్థించాల్సిన అవసరం లేదు. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఈశ్వరన్నను చీఫ్ విప్గా కేబినెట్ ర్యాంకులో పెట్టుకున్నారు. రెండో టర్మ్లో కేబినెట్ మంత్రిగా తీసుకున్నారు. కేబినెట్లో ఉన్నారు కాబట్టి ఎన్నో పనులు చేశారు. ధర్మపురిలో ఎన్నో అభివృద్ధి పనులు చేసుకున్నారు. ధర్మపురిని మున్సిపాలిటీ కూడా చేసుకున్నాం. ధర్మపురి మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు మంజూరు చేస్తున్నాను. 13 రకాల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను రూ. వందల కోట్లతో నిర్మాణం జరిగింది. 40 వేల ఎకరాలు ఉన్న ఆయకట్టును లక్షా 26 వేల ఎకరాలకు ఆయకట్టు తీసుకెళ్లారు. వెల్గటూరులో వ్యవసాయ కాలేజీ రాబోతోంది. ఇవాళ శంకుస్థాపన చేసుకున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.