Minister KTR | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ( TSPSC ) ప్రశ్నాపత్రాలు లీక్ చేయించిన కుట్ర ముమ్మాటికీ బీజేపీ( BJP )దే అని బీఆర్ఎస్( BRS ) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్( KTR ) పేర్కొన్నారు. ఈ కేసులోని నిందితులు బీజేపీ యాక్టివ్ కార్యకర్తలనే విషయం విచారణలో తేలిందని, తన రాజకీయాల కోసం లక్షల మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టి పేపర్ను లీక్ చేయించిన కుట్ర ముమ్మాటికీ బీజేపీదే అని కేటీఆర్ అన్నారు. శరవేగంగా చేపట్టిన నియామక ప్రక్రియ పూర్తయితే రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందన్న అక్కసుతోనే బీజేపీ ఇంత దుర్మార్గానికి, నీచానికి పాల్పడినట్టు మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇలా రాజకీయాల కోసం యువత భవితతో ఆడుకుంటున్న బండి సంజయ్ వంటి మోసగాళ్ల పట్ల రాష్ట్రంలోని యువతీ యువకులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు.
ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్లపై కోటి ఆశలతో విద్యార్థులు పరీక్షలకు సిద్ధమవుతుంటే.. వారిని పరీక్షలు పక్కన పడేసి తనతో కలిసి రావాలన్న దగుల్బాజీ నాయకుడు బండి సంజయ్కు అసలు యువత గురించి మాట్లాడే అర్హత లేదని కేటీఆర్ హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వం నోటిఫికేషన్లను విడుదల చేస్తే తమ పార్టీకి యువకులను దూరం చేసే కుట్ర అన్న దుర్మార్గుడు బండి సంజయ్ వ్యాఖ్యలను రాష్ట్ర యువత మర్చిపోలేదన్నారు. ఒక వ్యక్తి చేసిన తప్పును బూచిగా చూపించి మొత్తం పబ్లిక్ సర్వీసు కమిషన్ నే రద్దుచేయాలన్న అడ్డగోలు వాదన వెనక యువతను ఉద్యోగాలకు దూరం చేయాలన్న కుట్ర దాగి ఉందని కేటీఆర్ మండిపడ్డారు.