హైదరాబాద్, సెప్టెంబర్ 4 (నమస్తే తెలంగాణ): పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ జలవిజయ పతాకం ఎగురుతున్నదని మంత్రి కే తారకరామారావు వ్యాఖ్యానించారు. ‘ఆవిష్కృతం అవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం! సగర్వంగా ఎగురుతున్నది తెలంగాణ జలవిజయ పతాకం! నీటికోసం తండ్లాడిన నేలల్లో సుజల దృశ్యం సాక్షాత్కారం, ఇది తెలంగాణ సాగునీటి రంగంలో మరో కాళేశ్వరం’ అని ట్వీట్ చేశారు. దశాబ్దాల కలను సాకారం చేస్తూ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తి అవుతున్నదని వెల్లడించారు. బిరబిరా కృష్ణమ్మ బీళ్లకు నీళ్లందించనున్నదని, ఇది తెలంగాణ జలశక్తి, ఇది కేసీఆర్ ప్రభుత్వ చిత్తశుద్ధి అని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు సంబంధించిన ఫొటోలను కూడా పోస్ట్ చేశారు.
తెలంగాణలో మిగులు విద్యుత్తు
డబుల్ ఇంజిన్ రాష్ర్టాలుగా చెప్పుకునే బీజేపీ రాష్ర్టాలు, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు, వారి మిత్రపక్షాల పాలిత రాష్ర్టాలు తీవ్ర విద్యుత్తు కొరతతో అస్తవ్యస్థంగా మారాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అదే సమయంలో 2013-14లో లోటు విద్యు త్తు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ నేడు మిగులు విద్యుత్తు రాష్ట్రంగా అవతరించడమే కాకుం డా దేశంలోనే తలసరి విద్యుత్తు వినియోగంలో ప్రథమస్థానంలో నిలిచిందని సోమవారం ట్వీట్ చేశారు. రైతులకు నిరంతరం నాణ్యమైన విద్యుత్తును అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి నమూనా దేశానికి అత్యుత్తమ ఆదర్శవంతమైన నమూనా అని స్పష్టం చేశారు.